సాక్షి, వికారాబాద్: ఈ నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఆయోషా మస్రత్ ఖానం పేర్కొన్నారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ప్రతి మూడు వార్డులకు ఒక అధికారిని నియమించామని, బిఎల్వో ద్వారా ప్రతి ఓటరుకు ఫోటో ఉన్న ఓటర్ స్లీప్ పంపిణీ చేస్తామన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు త్వరగా ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పోస్టల్ ఓటు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, నాలుగు మున్సిపాలిటీలలో 228 పోలింగ్ కేంద్రాల్లో 52 సమాస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించామన్నారు. ఎన్నికల రోజు స్థానికంగా సెలవు ఉంటుందని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.