వందల్లో వచ్చే బిల్లులు ఒక్కసారిగా వేలల్లోకి!

5 Jun, 2020 13:42 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: ప్రతి నెల వందల రూపాయల్లో వచ్చే విద్యుత్‌ బిల్లులు ఒక్కసారిగా వేల రూపాయలు రావడంతో కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌ నర్వ గ్రామస్తులు కంగుతిన్నారు. కరెంట్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన సిబ్బందిని శుక్రవారం అడ్డుకున్నారు. వందల్లో వచ్చే కరెంట్‌ బిల్లులు వేలల్లో రావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ఇంటికి 11వేల రూపాయల నుంచి 20వేల రూపాయల వరకు బిల్లులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో తమ ఇళ్లకు సుమారు రూ.200 వందల నుంచి 400 వరకు బిల్లులు వచ్చేవని ఈ నెల మాత్రం 11 వేల రూపాయల నుంచి 15 వేల బిల్లులు వచ్చాయని తెలిపారు. కాయ కష్టం చేసుకొని బతికే తాము ఇన్ని బిల్లులు ఎలా కట్టాలని సిబ్బందిని నిలదీశారు. అసలే కరోనా లాక్‌డౌన్‌తో బతుకులు దుర్భరంగా మారాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్న చందంగా చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.

(చదవండి: కేటీఆర్‌కు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసులు)

మరిన్ని వార్తలు