విద్యుత్‌ సిబ్బందిని కట్టేసిన గ్రామస్తులు

18 Jul, 2020 16:07 IST|Sakshi

సాక్షి, మెదక్‌: అధిక విద్యుత్‌ బిల్లులపై వినియోగదారులు భగ్గుమన్నారు. ముట్టుకుంటేనే షాక్‌ కొడుతున్న కరెంట్‌ బిల్లులు చూసి ఆగ్రహం చెందిన మెదక్‌ జిల్లా మండల పరిధిలోని ముస్లాపూర్‌ గ్రామవాసులు విద్యుత్‌ సిబ్బందిపై తమ ప్రతాపం చూపించారు. విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అధికారులను పట్టుకుని గ్రామస్తులు స్తంభానికి కట్టేశారు. ఉన్నతాధికారులు వచ్చేంతవరకు వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

అధిక విద్యుత్‌ బిల్లులు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వంటి సమస్యలను చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారుల తీరుపై విసుగు చెందిన గ్రామస్తులు ఇలా నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. రోజులకు రోజులు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, అధిక కరెంటు బిల్లులు వసూళ్ల గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడు లేడని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా తమ వెతలకు పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు.

(చదవండి: నాటు వేస్తూ.. కబడ్డీ ఆడుతూ..)

మరిన్ని వార్తలు