అబద్ధాలు కాదు.. అభివృద్ధిని చూసి  ఓటు వేయండి

23 Nov, 2018 17:16 IST|Sakshi
గొల్లగూడెంలో మాట్లాడుతున్న పాయం..

సాక్షి,కరకగూడెం: గడిచిన నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటర్లు టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని పినపాక నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన కరకగూడెం కొత్తగూడెం, పాయంవారి గుంపు, గొల్లగూడెం, అనంతారం, తుమ్మలగూడెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాకముందు సీమాంద్రుల పాలనలో రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు సువర్ణపాలన అందించారని పేర్కొన్నారు. అభివృద్ధి,  సంక్షేమం అనే రెండు ఆయుధాలతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారని, ప్రజల అవసరాల మేరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. విపక్షాలు కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొలేక కూటమి కట్టి ప్రజలను మోసం చేయడానికి గ్రామాల్లోకి వస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే ఓటర్లు టీఆర్‌ఎస్‌ను మరోమారు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయా గ్రామస్తులకు టీఆర్‌ఎస్‌ కరపత్రాలను అందజేసారు. కార్యక్రమాల్లో సార సాంబశివరావు, ఎర్ర సురేష్, భవానీ శంకర్, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, వట్టం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు