నాలుగు మున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ
సాక్షి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టం పూర్తయింది. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్ల లె క్క తేలింది. ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సి పాలిటీలతో పాటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపి మొత్తం ఓటర్లు 4,35,838 మంది ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఇందులో మహిళలు 2,23,811, పురుషులు 2,12,009, ఇతరులు 18 మంది ఉన్నారు. ఈ తుది జాబితా ప్రకారమే మున్సిపల్ ఎన్నికల జరగనున్నాయి. ఈ మేరకు తుది ఓటర్ల జాబితాలను ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు శనివారం విడుదల చేశారు.
మార్పేమీ లేదు..
ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 30న ఓటర్ల ముసాయిదాను విడుదల చేసిన అధికారులు.. జనవరి 2వ తేదీ వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వచ్చిన అభ్యంతరాలను శుక్రవారం పరిష్కరించారు. ఓటర్ల నుంచి వచ్చి అభ్యంతరాల్లో చేర్పులు, మార్పులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ముసాయిదా జాబితాకు, తుది జాబితాకు ఓటర్ల సంఖ్యలో ఏ మాత్రం మార్పు జరగలేదు. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా, 8 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22న పోలింగ్ జరగనుండగా, 25న ఫలితాలు వెల్లడించనున్నారు.