బిల్లు రాకపాయె..ఇల్లు ఆగిపాయె!

22 Sep, 2014 01:51 IST|Sakshi
బిల్లు రాకపాయె..ఇల్లు ఆగిపాయె!

‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల్లో ఆందోళన
ఆర్నెళ్లుగా విడుదల కాని బిల్లులు
నిర్మాణ రంగంపై ప్రభావం
కూలీలకు ఉపాధి కూడా కరువే
కొత్త పథకంపైనే ఆశలు

 
 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు అర్ధంతరంగా నిలి చిపోయాయి. ఆరు నెలలుగా బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ముందు కు రావడం లేదు. సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక ధరలు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సారి ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గడంతో కూలీలకు చేతినిండా పని లేకపోగా, ఇంటి నిర్మాణాలు సైతం నిలిచిపోవడంతో పనులు దొరక్క కూలీలు వలస వెళ్లాల్సిన పరిస్థిలు నెలకొన్నాయి. ఇందిరమ్మ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు బిల్లులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే బిల్లుల చెల్లింపులు మాత్రం అందని ద్రాక్షగా మారాయి. జిల్లాలో  సుమారు 1.57 లక్షల మంది లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. జిల్లాలో మూడు విడతల్లో 2,41,992 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,57,824 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా,  అవి ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే 84,168 ఇండ్లు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. మరో 6,956 ఇండ్లు ప్రాథమిక దశలో ఉండగా, 15,390 ఇండ్లు బేస్మిట్ లెవల్‌లో, 1,689 ఇండల్లు లెంట ల్ లెవల్లో , రూఫ్ లెవల్‌లో 5,398 ఇండ్లు ఉన్నాయి. మరో 29,433 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొన్నాయి. జి ల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  కలిపి 1,28,391 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన జిల్లాలో 53 శాతం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది మా ర్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు రూ. 55,340 లక్షలు విడుదల చేసింది. అయితే గృహ నిర్మాణ అధికారులు ఇంటి నిర్మాణాన్ని బట్టి లబ్ధి దారులకు బిల్లులు చెల్లిస్తారు.

బిల్లుల చెల్లింపు ఇలా..

ఇందిరమ్మ పథకం ద్వారా  గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి మొత్తం 75 సిమెంట్ బస్తాలు ఇస్తారు. ఇవి గాక బేస్మిట్ లెవల్‌కు రూ.12,380, చార్జీల రూపంలో రూ. 2,100, రూఫ్ లెవల్‌కు రూ. 25,220, చార్జీల రూపంలో రూ. 1100, ప్లాస్టింగ్ లెవల్‌కు రూ.14,400, అదనపు చార్జీల రూపంలో రూ. వెయ్యి కలిపి మొత్తం రూ. 70 వేలు మంజూరు చేసేవారు. పట్టణ ప్రాంతాల్లో 75 సిమెంట్ బస్తాలు,  బేసిక్ లెవల్‌కు రూ. 12,380, అదనపు చార్జీలు రూ. 5,100, రూఫ్ లెవల్‌కు రూ. 32,120, అదనపు చార్జీల కింద రూ. 1200, ప్లాస్టరింగ్‌కు రూ. 11,200 ఇరత్రా కలిపి మొత్తం రూ. 80 వేలు చెల్లించేవారు. అదే ఎస్సీ, ఎస్టీల ఇండ్ల నిర్మాణాలకు 75 సిమెంట్ బస్తాలతో పాటు బేసిక్ లెవల్‌కు రూ. 17,380, అదనపు చార్జీలకు రూ. 200, రూఫ్ లెవల్‌కు రూ.34,670 అదనపు చార్జీల రూపంలో రూ.1650, ప్లాస్టరింగ్‌కు రూ. 33,900 అదనపు చార్జీల కింద రు. 1500 మొత్తం కలిపి రూ. 1.05 లక్షలు చెల్లించారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.05 లక్షలు, ఇతరులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 70 వేలు, పట్టణ ప్రాంతల్లో రూ. 80 వేలు చెల్లించేవారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 85 వేలు, ఇతరులకు రూ. 55వేలు మాత్రమే చెల్లించారు. గృ   హ నిర్మాణ సామాగ్రి పెరగడంతో ఇళ్ళ నిర్మాణానికి లబ్దిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచారు.  

కలగానే సొంతిల్లు

 సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనుకున్న లబ్ధిదారులు నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేసినా బిల్లులు మాత్రం చేతికి అందలేదు. జిల్లాలో మార్చి చివరి వారం నుంచి ఇప్పటి వరకు అధికారులు లబ్దిదారులకు బిల్లులు చెల్లించలేదు. నిర్మాణాలు పూర్తి చేసిన ఇండ్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన లబ్ధిదారులు తమ ఇండ్లను మధ్యలోనే నిలిపివేశారు. నిర్మాణాలు పూర్తయితే బిల్లులు వస్తాయి కదా అని అప్పు చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు బిల్లులు చేతికి అందక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. పైగా అధికారులు జిల్లా గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి నివేదిక తయారు చేసిసే పనిలో నిమగ్నమయ్యారు.  

రూ. 3.5 లక్షలపై ఆశలు

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రూ. 3.5 లక్షల చొప్పున బిల్లులు చెల్లిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు గంపె డాశతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారికే  ఈ పథకాన్ని వర్తింపజేస్తారా? లేదా గత మార్చి నెలలో దరఖాస్తు చేసుకొన్న వారికి సైతం వర్తింపజేస్తారా ? అంటూ చర్చించుకొంటున్నారు. ఇప్పటి వరకు ఈ పథకంలోని విధి విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు