నిల్‌..! సేఫ్‌ జోన్‌లో జిల్లా

14 Apr, 2020 13:32 IST|Sakshi
పురపాలక సంఘం తయారు చేసిన మాస్క్‌లను పంపిణీ చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

నెగెటివ్‌గా తేలిన మర్కజ్‌ క్వారంటైన్‌ కేసులు  

ఊపిరిపీల్చుకున్న అధికార యంత్రాంగం  

తగ్గుతున్న క్వారంటైన్‌ బాధితుల సంఖ్య  

వనపర్తి టౌన్‌:  జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంటోంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో బెంబేలెత్తుతున్న తరుణంలో జిల్లాలో మొదటి నుంచి కూడా ఒక్క కేసుకూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లోనే ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన పది మందితో పాటు వారి బంధువులు 66మందిని కలుపుకుని 63 రక్త నమూనాలను అధికారులు పరీక్షల నిమిత్తం పంపారు. వాటి ఫలితాలు రెండు మూడు రోజుల్లో రావాల్సి ఉంది. దీంతోపాటు ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి జిల్లావాసులు స్వగ్రామాలకు రావడంతో వారిని క్వారంటైన్‌లో ఉంచారు. వారికి సంబంధించి గతనెల 23 నుంచి 29 మంది నివేదికలు రాగా, ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదుకాలేదని అధికారులు తెలిపారు. 

ఇప్పటి వరకు బాగానే  ఉన్నా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని అ«ధికార యంత్రాంగం రక్షణ చర్యలను కట్టుదిట్టం చేసింది. ఇప్పటివరకు ఒక్క కేసు లేకపోయినా లాక్‌డౌన్‌ పూర్తి వరకు స్వీయ నిర్బంధం పక్కాగా అమలు చేస్తే ఇదే స్ఫూర్తితో వనపర్తి జిల్లాను కరోనా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు ఈనెల 30వరకు ఉన్న లాక్‌డౌన్‌కు సహకరించాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ఇతరప్రాంతాల నుంచి వచ్చినవారిని వెంటనే గుర్తించి హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో జిల్లాలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా సమాచారం అందేలా జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండంటంతో మొదట్లో పెద్దసంఖ్యలో ఉన్న హోం క్వారంటైన్‌ బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 

మాస్కులు ధరించాల్సిందే..  
కరోనా కట్టడిలో భాగంగా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు, అత్యవసర పనిమీదæ బయటకు వచ్చే వాళ్లు కచ్చితంగా మాస్కులు ధరించేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు మాస్కులు ప్రతిఒక్కరూ ధరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకులు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు, నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు మాస్కులు లేకుండా వెళితే ఇబ్బందులు తప్పడంలేదు. మాస్కుల కొరత దృష్ట్యా తొలి విడతగా ఒక్క వనపర్తి మున్సిపాలిటీ దాతల సహకారంతో 3వేల మాస్కులు తయారీ చేసేందుకు మహిళా సంఘాలకు కావాల్సిన వస్త్రం సమకూర్చడంతో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తొలి విడతగా వెయ్యి మాస్కులను మునిసిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు పంపిణీ  చేశారు. మాస్కులు లేకుంటే నిత్యావసరాల సరుకులు విక్రయంచవద్దని వ్యాపారులు ఇదివరకే కలెక్టర్‌ హెచ్చరించారు. దీంతో మాస్కుల తయారీకి దాతలు ముందుకు రావడం, కొందరు రుమాలుతో అడ్డుపెట్టుకోవడం విధిగా పాటిస్తున్నారు. అదే విధంగా ప్రజల సౌకర్యార్థం టీడీపీ తరఫున 2వేల మాస్కులను అందజేయడంతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి వాటిని పంపిణీ చేస్తున్నారు.  

ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి  
ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. అనుమానిత లక్షణాలు ఏ మాత్రం ఉన్నా వెంటనే అప్రమత్తం కావాలని, ఎక్కడెక్కడ తిరిగారో, ఎలాంటి అసౌకర్యంగా ఉందో వైద్యులకు వివరించాలి. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి.– మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్, వనపర్తి 

మరిన్ని వార్తలు