రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రోగుల దుర్మరణం

16 Oct, 2017 19:20 IST|Sakshi
హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి వద్ద మంటలు ఆర్పుతున్న ఫైరింజన్‌

హన్మకొండ రోహిణి ఆస్పత్రిలో వ్యాపించిన మంటలు

పొగ కారణంగా ఊపిరాడక ఇద్దరి మృతి..

వరంగల్‌ అర్బన్‌: హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు.

రోహిణి ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న ఆపరేషన్‌ థియేటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలు.. భవంతి అంతటా వ్యాపించడంతో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో మల్లమ్మ, కుమారస్వామి అనే రోగులు మరణించారు.

పొగ కారణంగా ఊపిరి అందక అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురిని ఎంజీఎంకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మల్లమ్మ అనే రోగి మరణించారు. ఆస్పత్రిలోని రోగులందరినీ బయటికి తీసుకొచ్చి, వేర్వేరు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నగరంలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబులు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

పేషెంట్‌ను వదిలేసి డాక్టర్ల పరుగు? : రోహిణి ఆస్పత్రి రెండో అంతస్తులోని ఆపరేషన్‌ థియేటర్లో మంటలు చెలరేగిన సమయంలో వైద్యులు ఓ వ్యక్తికి ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మంటలు చూసిన డాక్టర్లు.. పేషెంట్‌ను వదిలేసి పరుగులుతీసినట్లు సమాచారం. చిట్యాల వాసి జెట్టి కుమారస్వామి ఆపరేషన్‌ థియేటర్‌లోనే మరణించాడని ఆయన భార్య రోదిస్తూ చెప్పింది. 

మరిన్ని వార్తలు