వరంగల్ మార్కెట్ రాబడి రూ.20 కోట్లు

17 Jun, 2014 03:54 IST|Sakshi
వరంగల్ మార్కెట్ రాబడి రూ.20 కోట్లు
  •     గత ఏడాది కంటే రూ.75 లక్షల అధిక ఆదాయం
  •      త్వరలో ‘ఏ గ్రేడ్’ పొందే అవకాశం
  •      గుంటూరు తర్వాత స్థానంలో ‘ఏనుమాముల’
  • వరంగల్ సిటీ : ఆసియాలోనే రెండో అతి పెద్ద మార్కెట్‌గా పేరొందిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆదాయ ఆర్జనలో దూసుకెళుతోంది. ప్రతి సంవత్సరం కోటి రూపాయల చొప్పున ఆదాయం పెంచుకుంటూ పోతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్ల చేరువలోకి వచ్చి... త్వరలో ఏ గ్రేడ్ స్థానాన్ని పొందేందుకు సిద్ధంగా ఉంది. గత ర్థిక సంవత్సరంలో 18,61, 52,000 ఆదాయం ఆర్జించగా,  ఈ సంవత్సరం 19,36,84,000 ఆదాయాన్ని సమకూర్చుకుని రికార్డు సృష్టించింది.

    మార్కెట్ ఆదాయ లక్ష్యం రూ.22 కోట్లుగా నిర్దేశించగా... 20కోట్ల చేరువలోకి వచ్చి ఆగిపోయింది. గత సంవత్సరంతో పోల్చితే... రూ.75,32,000 అధిక రాబడి వచ్చింది. ఈ సారి పంటల సాగుబడి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ... ఇతర జిల్లాల నుంచి పంట ఉత్పత్తులు తరలిరావడంతో ఫీజు రూపేణా మార్కెట్‌కు భారీ ఆదాయం సమకూరింది. ఆదాయ ఆర్జనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు మార్కెట్ మాత్రమే రూ.20 కోట్లు దాటిన ఏ గ్రేడ్ మార్కెట్ కాగా... తెలంగాణలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ దాని తర్వాత స్థానంలో నిలిచింది.
     
    అగ్రస్థానం పత్తిదే...

    ఈ సంవత్సరం 1,54,886 క్వింటాళ్ల పత్తి రాగా... మార్కెట్‌కు ఫీజు రూపేణ రూ. 10.14 కోట్ల ఆదాయం సమకూరింది. అదేవిధంగా.. విత్తనాల మీద రూ.83 లక్షల రాబడి వచ్చింది. జిల్లా నుంచి పత్తి దిగుబడి తగ్గినా... ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బస్తాలు మార్కెట్‌కు తరలివచ్చాయి.
     
    రెండో స్థానంలో మిర్చి...

    ఈ సారి మిర్చి సాగు బడి తగ్గిన నేపథ్యంలో దిగుబడి అంతంతమాత్రంగానే ఉంటుందని భావించారు. అయితే అనుకోకుండా మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చింది. గత సంవత్సరం సీజన్ పూర్తయ్యే వరకు 3,455,66 క్వింటాళ్ల మిర్చి రాగా... ఈ సారి 4,166,50 క్వింటాళ్ల ఎర్రబంగారం మార్కెట్‌ను ముంచెత్తింది. గత ఏడాది కంటే ఈ సారి ధర ఎక్కువగా ఉండడంతో రైతులకు కొంత మేర ప్రయోజనం చేకూరగా... మార్కెట్‌కు భారీ ఆదాయం సమకూరింది. గత సంవత్సరం మిర్చి మీద మార్కెట్‌కు రూ.2.20 కోట్ల ఆదాయం సమకూరగా... ఈ  సంవత్సరం రూ. మూడు కోట్ల రాబడి వచ్చింది.
     
    పసుపు రాక తగ్గింది.. పల్లికాయ పెరిగింది
     
    ఈ ఆర్థిక సంవత్సరం పల్లి, పసుపు మీద మార్కెట్‌కు రూ.56 లక్షల ఆదాయం సమకూరింది. గత ఏడాది 34,541 క్వింటాళ్ల  పల్లి కాయ రాగా.. ఈ సంవత్సరం 68,946 క్వింటాళ్ల వేరుశనగ మార్కెట్‌కు వచ్చింది. అదేవిధంగా... గత ఆర్థిక సంవత్సరం 74,896 క్వింటాళ్ల  పసుపు రాగా... ఈ సారి  50,545 క్వింటాళ్ల పసుపు మాత్రమే వచ్చింది. గత సంవత్సరం కంటే పసుపు క్వింటాల్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ధర అధికంగా ఉండడంతో ఆదాయంలో  మాత్రం ముందంజలో ఉంది. ప్రతి సంవత్సరం మార్కెట్‌కు పసుపు రాక క్రమక్రమంగా తగ్గిపోతున్నట్లు, ఇదే క్రమంలో పల్లికాయ రాక ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
     
    మక్కలు..

    ఈ ఖరీఫ్, రబీ సీజన్లను కలుపుకుని మార్కెట్‌కు 2.90,170 క్వింటాళ్ల మక్కలు  రాగా... ఆదాయం రూ.1.22 కోట్లు సమకూరింది. ఐదేళ్లుగా మక్కల మీద మార్కెట్‌కు ఇంత ఆదాయం రావడం ఇదే మొదటి సారి.
     
    ధాన్యం..
    ఈ సంవత్సరం 78.225 క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌కు రాగా... ఆదాయం రూ.75 లక్షలు సమకూరింది.
     
    పండ్లు, కూరగాయల మార్కెట్..

    పండ్లు, కూరగాయల మార్కెట్ ద్వారా ఫీజు రూపేణా వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు ఈ సంవత్సరం రూ.75 లక్షల ఆదాయం వచ్చింది. పండ్లు, కూరగాయల మార్కెట్‌కు  ఈ సారి రూ.19,36,86,000 ఆదాయం వచ్చింది. నిర్ధేశించిన టార్గెట్ రూ.20 కోట్లకు చేరువలో ఆదాయం సకూరింది. ఇం దులో 10 శాతం మార్కెట్ అవసరాలకు ఉపయోగించు కోవచ్చు. అయితే పండ్లు, కూరగాయల మార్కెట్‌కు రూ.22 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. రూ.20 కోట్లు దాటితే ఏ గ్రేడ్‌తోపాటు జేడీ స్థాయి మార్కెట్‌గా అవతరించే అవకాశం ఉన్న నేపథ్యంలో రూ.20 కోట్లలోపే ఆదా యం ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
     

మరిన్ని వార్తలు