ఎకో ఫ్రెండ్లీ గ్రాఫెన్‌ను ఆవిష్కరించిన విద్యార్థులు

5 Jul, 2019 09:20 IST|Sakshi
గైడ్‌తో పరిశోధక విద్యార్థి

నీలగిరి చెట్ల బెరడుతో ఇంధనం తయారీ

విద్యుత్‌ ప్రవాహంలో కాపర్‌కు దీటుగా..     

సాక్షి, కాజీపేట : నిట్‌ వరంగల్, ఆస్ట్రేలియా విద్యార్థులు సంయుక్తంగా ఎకో ఫ్రెండ్లీ గ్రాఫెన్‌ను ఆవిష్కరించారు. నీలగిరి చెట్టు(బంకచెట్టు) బెరడుకు వివిధ రకాల రసాయన చర్యలు నిర్వహించి గ్రాఫెన్‌ ఇంధనం సృష్టించి నూతన పరిశోధనకు నాంది పలికారు. సాధారణంగా భారతదేశం, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధికంగా లభించే నీలగిరి చెట్లను విద్యుత్‌ ప్రవాహానికి ఉపయోగించే కాపర్‌కు దీటుగా రూపకల్పన చేయాలనే లక్ష్యంతో నిట్‌ వరంగల్‌కు చెందిన పీహెచ్‌డీ స్కాలర్లు సాయికుమార్‌ మంచాల, వీఎస్‌ఆర్‌కే.తాండవ, ఆస్ట్రేలియా ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీకి చెందిన జంపయ్య దేశెట్టి సంయుక్తంగా ప్రొఫెసర్లు డాక్టర్‌ విష్ణుశంకర్, సురేష్‌ పర్యవేక్షణలో పరిశోధనలు చేపట్టారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రకృతిలో లభించే నీలగిరి చెట్లను ఇంధన తయారీకి ఉపయోగించవచ్చని అంతర్జాతీయ పరిశోధన పత్రాలు, స్థిరమైన రసాయన శాస్త్రం, ఇంజినీరింగ్‌లో పొందుపరిచినట్లు గైడ్‌ విష్ణుశంకర్‌ గురువారం నిట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. ఈ పరిశోధనలు రాబోవు రోజుల్లో పరిశ్రమలకు తక్కువ ధరకు విద్యుత్‌ అందించేందుకు తోడ్పడతాయని వివరించారు.  

మరిన్ని వార్తలు