మళ్లీ ట్రిబ్యునల్‌కే!

10 Jan, 2017 03:03 IST|Sakshi

♦ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అఫిడవిట్‌ దాఖలు చేయనున్న రాష్ట్రం
♦ ఈ నెల 23 నుంచి ట్రిబ్యునల్‌ సమావేశాలు
♦ ఆలోగా అఫిడవిట్‌ వేసేందుకు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ట్రిబ్యునల్‌నే ఆశ్రయించనుంది. ట్రిబ్యునల్‌ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యా యాన్ని వివరిస్తూనే.. వాటిని సవరించాల్సిన ఆవశ్యకతను అఫిడవిట్‌ రూపంలో తెలిపే అవ కాశం ఉంది. ఈనెల 23 నుంచి ట్రిబ్యునల్‌ సమా వేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా ట్రిబ్యునల్‌ ముందు అఫిడవిట్‌ దాఖలు చేసే అవకాశాలు న్నట్లు నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది.

కేంద్రాన్ని 2014లోనే ఆశ్రయించినా..
నీటి కేటాయింపుల్లో తమకు జరిగిన అన్యాయా న్ని సవరించాలంటూ రాష్ట్రం 2014లో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం చేసిన అభ్యర్థనపై సెక్షన్‌ 3 ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించాల్సి ఉన్నా అలా చేయలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 89(ఎ), సెక్షన్‌(బీ)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయించాల్సి ఉంది. అయితే తెలంగాణ అవసరాలను, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని విచార ణ చేయాలని కేంద్రం స్పష్టంగా సూచించనం దున రాష్ట్రానికి ట్రిబ్యునల్‌ న్యాయం చేయలేదు. దీంతో రాష్ట్రం 2015లోనే సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దాన్ని అప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో కోర్టు జతపరిచింది. దీనిపై విచారణ జరుగుతుండగానే బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌.. నదీ జలాల కేటాయింపులను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ గతేడాది అక్టోబర్‌ 19న తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించిన తెలంగాణ ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. తాజాగా న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఇక ప్రధాన పిటిషన్ల విచారణపైనే తెలంగాణ ఆశలు పెట్టుకుంది.

ఇక అఫిడవిట్‌ ఇవ్వాల్సిందే..
బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తన తీర్పు సందర్భంగా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 89లోని ఏ, బీ క్లాజులపై నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని తెలంగాణ, ఏపీలకు సూచించింది. అయితే సుప్రీంలో వేసిన ఎస్‌ఎల్‌పీని దృష్టిలో ఉంచుకొని అఫిడవిట్‌ దాఖలుకు గడువు కోరగా... అందుకు ట్రిబ్యునల్‌ ఇప్పటిదాకా సమ్మతిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఎస్‌ఎల్‌పీని కొట్టి వేసినందున కచ్చితంగా అఫిడవిట్‌ సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు