లాక్‌డౌన్‌ ఎత్తివేతలో జోక్యం చేసుకోలేం

8 Jul, 2020 05:47 IST|Sakshi

అది ప్రభుత్వ విధాన నిర్ణయం: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ విధింపు.. ఎత్తివేయడం పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలని, ఇందులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలాంటి విధానపరమైన నిర్ణయాల్లో న్యాయ సమీక్షకున్న పరిమితులు చాలా స్వల్పమని స్పష్టం చేసింది. ప్రజల జీవనోపాధితోపాటు ఇతర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసిందని గుర్తుచేసింది. కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంపై పిటిషనర్‌ సునీతా కృష్ణన్‌ లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది.

కరోనా నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తూనే ఉన్నాయని, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయని పేర్కొంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేం ద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది. ధర్మాసనం సోమవారం తీర్పునిస్తూ, పరిస్థితులకు అనుగుణం గా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని, ఒకవేళ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా నిర్ణయాలు ఉన్నప్పుడు మాత్రమే కో ర్టులు జోక్యం చేసుకుంటాయని పేర్కొంది. ఎలా పడితే అలా ప్రభుత్వ కార్యనిర్వాహక నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. 
 

మరిన్ని వార్తలు