‘ఓటరు ఆలోచన మారింది..పార్టీ థింకింగ్‌ కూడా మారాలి’

6 Jan, 2019 14:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ లైన్‌ ఆఫ్‌ థింకింగ్‌ మార్చుకోవాలని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అభిప్రాయపడ్డారు. ఓటర్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని, దానికి అనుగుణంగా పార్టీ తీరు కూడా మారాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభావంపై గాంధీభవన్‌లో సమీక్షా సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమావేశంలో దామోదర మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి ప్రధానంగా మూడు, నాలుగు కారణాలున్నాయని అన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అధికార దుర్వినియోగంతో పాటు ఎన్నికల సంఘం తీరుపై అనేక అనుమానాలున్నాయని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉందని, ఈసీ నిర్ణయాలు కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకుపోవడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని, ప్రజాసమస్యలపై పోరాటం చేయ్యలేకపోయ్యామని దామోదర తెలియజేశారు. అభివృద్ధికి ఓట్లకు సంబంధంలేదని, చివరి ఇరవై రోజులు ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు.   

మరిన్ని వార్తలు