ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడదాం: కోదండరాం 

26 Nov, 2019 03:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు తీర్పుపై గౌరవం ఉంచి, శాంతియుత పరిష్కారం కోసం సమ్మె విరమించి మంగళవారం ఉదయం విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులకు పార్టీ శ్రేణులు, పౌరసమాజం, ప్రజలు మద్దతుగా నిలవాలని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విజ్ఞప్తిచేశారు. కార్మికుల కుటుంబాలకు ధైర్యం ఇచ్చేలా కార్యాచరణ ఉండాలని ఆయన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నామన్నారు. ప్రజారవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసి, కార్మికుల పొట్టలు కొట్టే దుర్మార్గానికి ఒడిగట్టిన ప్రభుత్వం నేడు కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమిస్తామన్నా ఎటూ తేల్చక మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని టీజేఎస్‌ నాయకులు ఎక్కడికక్కడ ఎండగట్టాలని కోరారు.   

>
మరిన్ని వార్తలు