సాక్షి, హైదరాబాద్: టీఎస్–ఐపాస్ ద్వారా పారిశ్రామిక విప్లవానికి తెలంగాణ నాంది పలికిందని ఎంపీ కవిత అన్నారు. గత పాలకులు పరిశ్రమలను నిర్లక్ష్యం చేయడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పునర్ నిర్మాణమవుతుందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఈ రంగం స్థితిగతులను స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్–ఐపాస్ ప్రశంసలు అందుకుంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలు స్థాపించేందుకు టీఫ్రైడ్ ద్వారా రుణాలు అందుతున్నాయని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ లక్ష్యంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ పనిచేస్తోందన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు 7,802 పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని, 1.31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.