మాది దమ్మున్న ప్రభుత్వం : హరీష్‌

17 Nov, 2018 16:36 IST|Sakshi

సాక్షి, మెదక్ : కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు, టీఆర్‌ఎస్‌ గెలిస్తే తాగు నీళ్లు వస్తాయని ఆపధర్మ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం నర్సాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లు మంత్రిగా ఉన్న సునిత లక్ష్మారెడ్డి నర్సాపూర్‌కు కనీసం బస్‌డిపోను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. సునిత హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్‌ సిద్దమా అని సవాలు విసిరారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి నర్సాపూర్‌ను దత్తత తీసుకుంటాననడం హాస్యస్పదమన్నారు.

కాంగ్రెస్‌లో సీట్ల గొడవ ఇంకా ఆగిపోలేదని.. త్వరలో కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేసింది టీఆర్‌ఎస్‌ నేతలని.. కాంగ్రెస్‌ నేతలు కాదని గుర్తుచేశారు. తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇక్కడి ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. తమది దమ్మున్న ప్రభుత్వమని.. నర్సాపూర్‌ అభివృద్ధికి 25 కోట్లు ఖర్చు చేసినట్లు హరీష్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు