ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నాం

1 Dec, 2019 05:47 IST|Sakshi

నిరసనగా సోమవారం అన్ని జిల్లాల్లో ర్యాలీలు

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా భారత్‌ బచావో

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ చార్జీల పెంపును కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోందని టీపీసీసీ అధ్య క్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. చార్జీల పెంపునకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఉత్తమ్‌ అధ్యక్షతన టీపీసీసీ కోర్‌కమిటీతో పాటు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షు లు, పీసీసీ ఆఫీస్‌ బేరర్ల సమావేశం జరిగింది. అనంతరం రాత్రి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్‌.సి.కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్, కార్యదర్శి చిన్నారెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారదతో కలిసి ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ కోర్‌కమిటీ, ఆఫీస్‌బేరర్ల సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మున్సిపల్‌ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె, చార్జీల పెంపు, డిసెంబర్‌ 14న ఢిల్లీలో నిర్వహించనున్న భారత్‌ బచావో ఆందోళనపై చర్చించినట్టు చెప్పారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున కిలోమీటర్‌కు 20 పైసలు ఆర్టీసీ చార్జీలు పెంచడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్ని కలు జనవరిలో వస్తాయని తాము అంచనా వేస్తున్నామని, ఇందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు.

డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్యకు ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణలో జరుగుతున్న విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, మద్యం అమ్మకాలను తగ్గించాలని ఆయన డిమాం డ్‌ చేశారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.  బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తో దేశ ఆరి్థక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని,  కేంద్రం తీరుకు నిరసనగా డిసెంబర్‌ 14న ఢిల్లీలో ‘భారత్‌ బచావో’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.   

>
మరిన్ని వార్తలు