సీపీఎస్‌ను రద్దు చేసే వారికే మద్దతు

27 Oct, 2018 03:23 IST|Sakshi

టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి

సంగారెడ్డి జోన్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన వారికే తమ మద్దతు ఉంటుందని టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని టీఎన్‌జీవో భవన్‌లో మెదక్, సంగారెడ్డి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో అనేక సమస్యలతోపాటు పీఆర్‌సీపై ఏళ్ల తరబడి పోరాటం చేసినా లాభం లేకుండా పోయిందన్నారు.

స్వరాష్ట్రంలో ఒక్క రోజులో 43 శాతం పీఆర్‌సీని, 9 నెలల బకాయిలని సాధించుకోగలిగామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో నవంబ ర్‌ 6 వరకు మాత్రమే ఓటర్‌ నమోదుకు గడువు విధించారని, దానిని మరో పక్షం రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరామన్నారు. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్న క్రమంలో గతంలో అనేక పర్యాయాలు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా ఏ ఒక్క నియోజకవర్గంలో వందకు మించి అవకాశం కల్పించాలేదన్నారు. ఈ సారి ఆన్‌లైన్‌లో ఓటు హక్కును వినియోగించుకునేలా కలెక్టర్, రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో వారం ముందుగానే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కొండల్‌రెడ్డి, కార్యదర్శి రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు