శ్రీశైలం విద్యుదుత్పత్తిపై గవర్నర్కు వివరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సాగునీటి కోసం వాడుకోవడానికి తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన హక్కుతోనే శ్రీశైలంలో కరెంటును ఉత్పత్తి చేస్తున్నామని రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వివరించారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు రాజ్భవన్కు వెళ్లిన సీఎం.. 7 గంటల వరకు గవర్నర్తో చర్చించారు. శ్రీశైలం రిజర్వాయర్లోని నీటిపై తెలంగాణకు ఉన్న హక్కులను, దానికి సంబంధించిన గత జీవోలను, ట్రిబ్యునల్ కేటాయింపులను గవర్నర్కు నివేదించారు. శ్రీశైలం ద్వారా కరెంటు ఉత్పత్తి చేయకుంటే తెలంగాణ రైతాంగానికి జరిగే నష్టంపైనా వివరించినట్టుగా తెలిసింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 54 శాతం వాటాను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూనే, మరోవైపు శ్రీశైలం కరెంటు ఉత్పత్తిని వివాదం చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని గవర్నర్కు చెప్పినట్టుగా సమాచారం. నవంబర్ 5 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటివాటిపైనా కేసీఆర్ చర్చించారు. పలు అంశాలపై గవర్నర్ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నట్టుగా తెలిసింది.