మీడియాపై కేసులు నమోదు చేస్తాం: రజత్‌ కుమార్‌

16 Apr, 2019 15:47 IST|Sakshi
తెలంగాణ సీఈఓ రజత్‌ కుమార్‌

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంపై మనందరికీ నమ్మకం ఉండాలని, సోషల్‌ మీడియాలో పోలింగ్‌ పర్సంటేజీపై అసత్య ప్రచారం జరగడంపై ఈసీ ఆగ్రహంగా ఉందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం సెక్రటేరియట్‌లో రజత్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌ జరిగిన రోజే పోలింగ్‌ పర్సంటేజీ అంత కరెక్ట్‌గా తెలియదని, అంచనా వేసి మాత్రమే చెప్తామని అన్నారు. పోలింగ్‌ జరిగిన రోజు సాయంత్రమే ఎస్టిమేషన్‌ పోలింగ్‌ పర్సంటేజ్‌ ఎంత అని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ అడుగుతుంది..కాబట్టి తాము ఎస్టిమేషన్‌ పర్సంటేజ్‌  మాత్రమే చెప్తామని వెల్లడించారు.

17ఏ, 17సీ కాపీ ప్రతి పోలింగ్‌ ఏజెంట్‌కు ఇస్తాం.. పోలింగ్‌ అయిపోయాక పోలింగ్‌ ఏజెంట్ల సంతకం రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తీసుకుంటారని పేర్కొన్నారు.  పోలింగ్‌ అనంతరం ఈవీఎంలు,17ఏ, 17సీ కాపీలను సీల్‌ వేసి స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచామని తెలిపారు. అసత్య ప్రచారం చేస్తోన్న సోషల్‌ మీడియాపై కేసులు కచ్చితంగా బుక్‌ చేస్తామని హెచ్చరికలు పంపారు. జగిత్యాలలో ఆటోలో తీసుకెళ్తున్న ఈవీఎం, శిక్షణలో ఉన్న వారి కోసం వాడారని స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తం నాలుగు రకాల ఈవీఎంలు ఉన్నాయని, ఎ కేటగిరీ ఈవీఎంలు మాత్రమే పోలింగ్‌కు వాడుతున్నామని తెలిపారు.

వంద మీటర్ల లోపు పోలింగ్‌ బూత్‌ల వద్దకు వాహనాల అనుమతి లేదని చెప్పారు. మాక్‌ పోలింగ్‌లో ఫెయిల్‌ అయిన ఈవీఎంలను సీ కేటగిరీ ఈవీఎంలుగా పరిగణిస్తామని, వాటిని వెంటనే కలెక్టర్‌ కార్యాలయానికి తరలిస్తామని అన్నారు. కీసర స్ట్రాంగ్‌ రూంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెళ్లిన సందర్భం వేరు.. స్ట్రాంగ్‌రూంలో ఈవీఎంలు పెట్టే ముందు అన్ని రాజకీయపార్టీల వారు పరిశీలిస్తారు.. ఆ సందర్భంలోనే ఆయన ఫోటో తీసుకున్నాడని చెప్పారు. పోల్‌ అయిన ఓట్లలో నోటా ఓట్లను తొలగించి పర్సంటేజీ లెక్కిస్తామని, పోలిటికల్‌ మోటివేషన్‌తోనే సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు