మెదక్ రైలు మార్గం.. సాధించి తీరుతాం

23 Sep, 2014 23:54 IST|Sakshi

 మెదక్: మెదక్‌కు రైలు మార్గం సాధించి తీరుతామని, ఇది తమకు ప్రతిష్టాత్మకమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా మెదక్ పట్టణానికి వచ్చిన ఆయనకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన  డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి, డిప్యూటీ స్పీకర్ కు, మంత్రికి, ఇద్దరు ఎంపీలకు సొంత జిల్లా కావడంతో రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు.

మెదక్ ప్రజల చిరకాల స్వప్నమైన రైలు మార్గాన్ని సాధించితీరుమన్నారు. మెదక్-అక్కన్నపేట రైల్వే లైను, మనోహరాబాద్-కొత్తపల్లి మార్గాలు పూర్తయ్యేందుకు కేంద్రం నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా చెల్లించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకళ తెస్తామన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటూ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాను అభివృద్ధి చేసేందుకు సైనికునిలా పనిచేస్తాన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్‌ఎస్ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు, ఎంపీకి వారధిగా పనిచేసి మెదక్‌ను కడిగిన ముత్యంలా మారుస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యారెడ్డితో పాటు కార్యకర్తలు ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని, దేవేందర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు.

>
మరిన్ని వార్తలు