వికటించిన పెళ్లి భోజనం 

9 May, 2019 04:50 IST|Sakshi

ముగ్గురు చిన్నారులు మృతి 

నార్నూర్‌ (ఆసిఫాబాద్‌): పెళ్లి విందు భోజనం వికటించి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 21 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలో చోటు చేసుకుంది. నార్నూర్‌ మండలం కొత్తపల్లి–హెచ్‌ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ (గణపతిగూడ)లో ఇరవై కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మిబాయి ఇంట్లో మంగళవారం పెళ్లి జరిగింది. బుధవారం విందు ఏర్పాటు చేశారు. భోజనం వికటించడంతో 24 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో చింటు, అయ్యు, కొడప ముత్తు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.  

చిన్నారుల మృతితో గిరిజనుల ఆగ్రహం 
పీహెచ్‌సీలో సకాలంలో వైద్యం అందకపోవడం, 108 రాకపోవడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారని ఆరోపిస్తూ బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఐటీడీఏ పీవో కొలాంగూడను సందర్శించి పరిస్థితిని ఆరా తీశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మిగతా వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంతరావును ఆదేశించారు.  

మరిన్ని వార్తలు