ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం

31 Mar, 2018 11:43 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న చాంబర్‌ ప్రతినిధులు కటకం పెంటయ్య, బొమ్మినేని రవీందర్‌రెడ్డి తదితరులు

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు కటకం పెంటయ్య 

జీఓ 58లో సవరణలు, నూతనంగా 39జీఓ విడుదల

వరంగల్‌ సిటీ : రాష్ట్రంలో అన్ని వ్యాపార రంగాలను ప్రోత్సహిస్తూ రాయితీలు కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని రాష్ట్ర, వరంగల్, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కటకం పెంటయ్య, తెలంగాణ కాటన్‌ అసోషియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లలోని అడ్తి,వ్యాపారుల డిపాజిట్‌లతో పాటు భారీగా లైసెన్సుల రెన్యూవల్‌ ఫీజులను పెంచడంతో రాష్ట్రంలోని అన్ని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ల ఆధ్వర్యంలో నూతన జీవో.58ను సవరించాలని కోరుతూ అడ్తి, వ్యాపారులు నిరసన ర్యాలిలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పలుమార్లు మార్కెట్‌ శాఖ మంత్రి హరీష్‌రావును కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. మూడు నెలల అనంతరం ఎట్టకేలకు రా ష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావు అనుమతితో జీవో.నం. 58ను సవరిస్తూ నూతనంగా జీఓ.నం 39ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. నూతన జీఓలో అడ్తి, వ్యాపారులకు అనేక అనుకూల, సానుకూల రాయితీలు కల్పించడంతో శుక్రవారం వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా చాంబర్‌ ఆఫ్‌ అధ్యక్షులు, కాటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కటకం పెంటయ్య, బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడారు. కూరగాయలు, పండ్ల వ్యాపారుల బ్యాంకు గ్యారంటీని రూ.3లక్షల నుంచి రూ.25వేలకు, కోటి టర్నోవర్‌ కలిగిన రూ.5 లక్షల బ్యాంకు గ్యారంటీని రూ.50వేలకు, రూ.5కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన వారికి రూ.లక్షకు తగ్గించడం హర్షనీయమని చెప్పారు. అదే విధంగా ఇతర లైసెన్సుల రెన్యూవల్స్‌ ఫీజులను కూడా సంతృప్తి పడే విధంగా తగ్గించారని వివరించారు. అనంతరం చాంబర్‌ ప్రధాన కార్యదర్శి గోరంటాల యాదగిరి, కార్యనిర్వాహక అధ్యక్షలు కంది రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు దుగ్యాల గోపాల్‌రావులు పాత, కొత్త జీఓల సవరణలు వ్యాపారులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. జీఓ సవరణకు సహకరించిన కొండా దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఛాంబర్‌ ముఖ్య ప్రతినిధులు నాగమళ్ల పూర్ణచందర్‌రావు, రాయిశెట్టి సత్యనా రా యణ, అల్లె సంపత్, వీరారావు, ఎస్‌.భిక్షపతి, కరాణి రాజేష్, కూరగాయల సంఘం నుంచి బేతి అశోక్, జూల రాజేందర్, పండ్ల మార్కెట్‌ అసోసియేషన్‌ నుంచి  సాంబయ్య, గుమస్తాల సంఘం నాయకుడు ఇనుముల మల్లేషం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు