20వ తేదీ రాత్రి ఏం జరిగింది?

29 Jul, 2019 02:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జైపాల్‌రెడ్డి ఆకస్మిక మర ణం ఆయన కుటుంబ సభ్యుల్ని, సన్నిహితులు, అభిమానులను, పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కలిచివేసింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా జ్వరం బారిన పడటం, అది కాస్త తీవ్రమై వారం రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించడం అంతా కలలాగే ఉం దని ఆయన సన్నిహితులంటున్నారు. శనివారం 20వ తేదీ మధ్యాహ్నం తనకు జ్వరంగా ఉందని జైపాల్‌రెడ్డి ఇంట్లో వారికి చెప్పాడు. ఆ సమయంలో జైపాల్‌రెడ్డి అల్లుడు (కూతురి భర్త) డాక్టర్‌ ఆనంద్‌ అక్కడే ఉన్నాడు. జైపాల్‌ రెడ్డిని పరిశీలించిన ఆయన జ్వరం తగ్గేందుకు మాత్ర ఇచ్చారు. దాంతో జ్వరం తగ్గినట్లే తగ్గినా.. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎక్కువైంది. దీంతో అల్లుడు ఆనంద్, పెద్దకుమారుడు అరవింద్‌రెడ్డి హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏషియయన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రికి తరలించారు.

చదవండి: జైపాల్‌రెడ్డి ఇక లేరు..

ఆదివారం నాటికి జైపాల్‌రెడ్డికి శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దాంతో వైద్యులు ఆయన్ను ఆదివారం రాత్రి ఐసీయూకి మార్చారు. గుండె కొట్టుకునే రేటు నెమ్మదిగా ఉండటంతో వెంట నే వెంటిలేటర్‌ అమర్చారు. ఇదే సమయంలో ఆయనకు నిమోనియా అటాక్‌ అయింది. రెండురోజుల తర్వాత ఊపిరితిత్తుల్లో నీళ్లున్నాయ ని గుర్తించిన వైద్యులు చికిత్సనందించారు. గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయి. వీటికి చికిత్స జరుగుతుండగానే.. ఈ సమస్యలకు కాస్త ముదిరి శనివారం రాత్రి (ఆదివారం తెల్లవారుజామున) 1.08 నిమిషాలకు జైపాల్‌రెడ్డి కన్నుమూసారు.  

20 ఏళ్లుగా ఓఎస్డీ, డ్రైవర్‌లు కీలకం 
జైపాల్‌రెడ్డి జీవితంలో కుటుంబ సభ్యులు కాకుండా ఇద్దరు వ్యక్తులు రెండు దశాబ్దాలుగా ఆయనతోనే ఉన్నారు. ఒకరు ఓఎస్డీ వెంకటరామిరెడ్డి, రెండో వ్యక్తి కారు డ్రైవర్‌ పాషా. వీరిద్ద రూ 20 ఏళ్లకుపైగా జైపాల్‌రెడ్డి వద్దే పనిచేస్తున్నారు. వెంకటరామిరెడ్డి.. జైపాల్‌రెడ్డికి వీరాభిమాని, శ్రేయోభిలాషి, వీరిద్దరిది గురుశిష్యుల అనుబంధమని సన్నిహితులు చెబుతారు. 1999లో ఆయన వద్ద వీరిద్దరూ చేరారు. అప్ప టి నుంచి ఆదివారం తుదిశ్వాస విడిచేవరకు వీరిద్దరూ జైపాల్‌రెడ్డి వెన్నంటే ఉన్నారు. 

ఆయనో స్టేట్స్‌మన్‌: నరసింహారెడ్డి 
జైపాల్‌రెడ్డి స్వా ర్థం లేని, ముక్కుసూటి మనిషని ఆయన సన్నిహితుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పి.నరసింహారెడ్డి అన్నారు. జైపాల్‌ రెడ్డి తో సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. జైపాల్‌రెడ్డి దేశప్రయోజనాల గురించే ఆలోచించేవారని నరసింహారెడ్డి అన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. రిలయన్స్‌ కంపెనీ నుంచి రావాల్సిన వేల కోట్ల రూ పాయల బకాయిలను చెల్లించాల్సిందేనంటూ నోటీసులు పంపే విషయంలో జైపాల్‌రెడ్డి ఏమాత్రం సం శయించలేదని గుర్తుచేశారు. ఈ నిర్ణయం సంచనలమై ఆ తర్వాత వివా దం రేపి ఆయన మంత్రిత్వ శాఖ మార్పుకు కారణమైనప్పటికీ.. జైపా ల్‌ దీన్ని పెద్దగా పట్టించుకోలేదన్నా రు. తెలంగాణ ఉద్య మ సమయంలో ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారని నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయన స్థానంలో వేరేవరున్నా.. సీఎం కుర్చీపై ఆశతో తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షల్ని తాకట్టు పెట్టి ఉండేవారన్నారు. నిత్యం ప్రజలు, ప్రజాస్వామ్య విలువల గురించే పరితపించే మహనీయుడని ప్రశంసించారు. ఎమర్జెన్సీలో పార్టీని వీడినా.. 1999లో మతశక్తులు బలపడటాన్ని చూసి సెక్యులర్‌ భావజాల పరిరక్షణకు ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారని వెల్లడించారు. పార్టీ, దేశప్రయోజనాలకోసం నిజాయతీగా పనిచేసిన సైనికుడని నరసింహారెడ్డి కొనియాడారు. 

మధ్యలోనే ఆగిన జీవిత చరిత్ర! 
జైపాల్‌రెడ్డి రాజకీయ చాణక్యుడు, నడిచే గ్రంథాలయంగా మిత్రులు, సన్నిహితులు అభివర్ణిస్తారు. ఈ విషయం పలుమార్లు పార్లమెంటు వేదికగా ఆయన నిరూపించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా జైపాల్‌ రెడ్డి సామర్థ్యాన్ని ప్రశంసించేవారు. అద్భుతమైన వాగ్ధాటి కలిగిన జైపాల్‌రెడ్డి మంచి రచయిత కూడా. ఆయన తన రాజకీయ జీవితంలో జరిగిన కీలక ఘట్టాలని ‘టెన్‌ ఐడియాలజీస్‌’అనే శీర్షికతో పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం అమేజాన్‌లో అందుబాటులో ఉంది. కొద్దికాలం క్రితమే ఆయన జీవిత చరిత్ర మొదలుపెట్టినట్లు సమాచారం. దురదృష్టవశాత్తూ ఈ పుస్తకం మధ్యలో ఉండగానే ఆయన కన్నుమూసారు.

అదే చివరి రాజకీయ కార్యక్రమం 
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక ఘటనలకు సాక్షీభూతంగా నిలిచిన జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో తన చివరి రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ జూన్‌ 8,9 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నిర్వహించిన నిరాహార దీక్ష కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. ఇదే ఆయన చివరి రాజకీయ కార్యక్రమం.  

మరిన్ని వార్తలు