అసలేం జరిగింది?

18 Oct, 2017 02:24 IST|Sakshi

వారి కారు డిండి వరకు వెళ్లిందా? లేదా?

సెల్‌ఫోన్లు ఏమయ్యాయి?

ప్రభాకర్‌రెడ్డి పంపిన చివరి మెసేజ్‌లో ఏముంది?

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌పై ఐదు మృతదేహాల ఉదంతం ఆద్యంతం మిస్టరీగా మారింది. ఈ వ్యవహారంలో అసలేం  జరిగిందన్న అంశంపై నార్సింగి పోలీసులు దృష్టిసారించారు. ప్రభాకర్‌రెడ్డి తన భార్య మాధవి, కుమారుడు, పిన్ని, ఆమె కూతురుతో కలసి అసలు డిండి వరకు వెళ్లారా లేదా అన్నది తెలియడం లేదు. మధ్యాహ్నం సిగ్నోడ్‌ కాలనీ నుంచి బయల్దేరి డిండి వెళ్లి రావడానికి కనీసం ఎనిమిది గంటల సమయం పడుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సాయత్రం 6 గంటల సమయంలో మరో  గంటలో ఇంట్లో ఉంటామని రవీందర్‌రెడ్డికి లక్ష్మి ఫోన్‌లో చెప్పింది. ఈ సమయంలో దాదాపు 150 కి.మీ. దూరంలో ఉన్న డిండి వరకు వెళ్లి రావడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి సెల్‌ లొకేషన్స్‌తో పాటు వివిధ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

లొకేషన్స్‌ ప్రకారం వీరి కారు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ విమానాశ్రయం దాటి వెళ్లినట్టు నిర్ధారణ అయింది. వీరిలో  ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మి వద్ద మాత్రమే సెల్‌ఫోన్‌లు ఉన్నాయి. అవి కూడా రాత్రి 9 గంటలకు స్విచ్చాప్‌ అయిపోయాయి. ఆ తర్వాత ఫోన్లు ఏమయ్యాయయన్నది తెలియట్లేదు. వాటికోసం పోలీసులు వెతుకుతున్నారు. వాటి లొకేషన్స్‌ ప్రకారం స్విచ్చాఫ్‌ కావడానికి కొద్దిసేపటి ముందు వారు ముత్తంగిలో ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో వాహనంలో అక్కడ వరకు వెళ్లి వెనక్కు వచ్చినట్లు భావిస్తున్నారు. మృతదేహాల స్థితిని బట్టి తెల్లవారుజాము సమయంలో విషం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆ సమయం వరకు ఓఆర్‌ఆర్, ఆ సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ పురుగుమందుతో పాటు కూల్‌డ్రింక్స్‌ తదితరాలు కొని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి తన సెల్‌ నుంచి సోమవారం సాయంత్రం సమీప బంధువు విష్ణువర్ధన్‌కు చివరి ఎస్సెమ్మెస్‌ ఇచ్చినట్లు వెల్లడైంది. అందులో ఏముందన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు