పీజీ వైద్య సీట్ల భర్తీ ఎప్పుడు?

21 Sep, 2016 02:41 IST|Sakshi

ఏపీలో 86, తెలంగాణలో 32 పీజీ వైద్య సీట్లు మిగిలిన వైనం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 118 పీజీ సీట్లు మిగిలిపోయినా రెండు తెలుగు రాష్ట్రాలు కౌన్సెలింగ్ నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పీజీ వైద్య సీట్ల భర్తీకి తొలిసారిగా 2016-17లో వెబ్ కౌన్సెలింగ్ పెట్టారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఏపీలో 86 పీజీ సీట్లు, తెలంగాణలో 32 సీట్లు మిగిలిపోయాయి. అయినప్పటికీ మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించే దిశగా వర్సిటీలు చర్యలు తీసుకోలేదు. దీంతో కొందరు విద్యార్థులు జూలై 13న హైకోర్టును ఆశ్రయించారు. రెండు రాష్ట్రాల్లో మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ జరపాలని హైకోర్టు ధర్మాసనం అదేనెల 23న తీర్పునిచ్చింది.

అయితే ఎంసీఐ హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) వేసింది. దీనిపై సుప్రీం కోర్టు ఈనెల 8న తీర్పునిచ్చింది. చివరి విడత కౌన్సెలింగ్‌ను రెండువారాల్లోగా నిర్వహించి సీట్లను భర్తీ చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్‌కు పూనుకోకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

గడువు ముగిశాక ఆర్డర్ కాపీ వచ్చింది
సుప్రీంకోర్టు 2 వారాల్లో కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పింది. కానీ ఆ ఉత్తర్వుల కాపీ గడువు ముగిశాక వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును వివరణ కోరాం. కోర్టు ఆదేశాలు రాగానే కౌన్సెలింగ్ నిర్వహిస్తాం.
 - డాక్టర్ టి.రవిరాజు, వీసీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ

>
మరిన్ని వార్తలు