ఈ అవ్వకు ‘ఆసరా’ ఏది?

19 Mar, 2018 13:05 IST|Sakshi
కూతురు లస్మక్కతో సమ్మక్క

అధికారులే స్వాహా చేసిన వైనం

వేమనపల్లి(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా వేమనపల్లికి చెందిన కోట సమ్మక్క శతాధిక వృద్ధురాలు.. నడవలేని స్థితిలో ఉంది. ఆమెకు ఆసరా  పింఛన్‌ అందడం లేదు. పెన్షన్‌ ఇప్పించమని ఇప్పటికి ఆరుసార్లు దరఖాస్తు చేసుకుంది. 2016 మార్చి నుంచి ఆ వృద్ధురాలికి పింఛన్‌ వస్తుంది. కానీ పంపిణీ చేసే అధికారులే కుటుంబానికి తెలియకుండా పెన్షన్‌ స్వాహా చేశారు. సమ్మక్క కూతురు ఏమ లస్మక్క భర్త గతంలో మత్యువాతపడడంతో తల్లివద్దే ఉంటోంది. ఇద్దరూ కలిసి వేమనపల్లిలో సమ్మక్క కుమారుడు కోట రాజం వద్ద ఉంటున్నారు రాజం సైతం రెండేళ్ల క్రితం మృతిచెందగా కోడలు మల్లక్కే వారికి దిక్కయ్యింది. విచిత్రం ఏమిటంటే వృద్ధురాలైన సమ్మక్కకు పెన్షన్‌ రావటం లేదు.

కానీ ఆమె కూతురు లస్మక్కకు ఆసరా పెన్షన్‌ ఇస్తున్నారు. వారం రోజుల క్రితం పెన్షన్‌ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఆమెకు అసలు విషయం తెలిసింది. సమ్మక్కకు 2016 మార్చి నెలలోనే పెన్షన్‌ మంజూరైనట్లు జాబితాలో ఉంది. స్థానికంగా ఉండటం లేదని చూపించారు. మార్చి, ఏప్రిల్, మే  మూడు నెలల ఒకసారి అధికారులే డ్రాచేశారు. ఆ తర్వాత జూన్, జులై నెలల పెన్షన్‌ ఆగస్టులో అధికారులే స్వాహా చేశారు. అప్పటి నుంచి వృద్ధురాలు స్థానికంగా ఉండటం లేదని పెన్షన్‌ రద్దుచేశారు. పెన్షన్‌ కాజేయటం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. అధికారులు విషయం బయటికి పొక్కకుండా కుటుంబ సభ్యుల దరఖాస్తును తీసుకుని మళ్లీ మంజూరుకు పంపారు.

  పెన్షన్‌డ్రా అయినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తున్న దృశ్యం 

మరిన్ని వార్తలు