సీఎస్ వద్ద రాష్ట్ర ఎంపీల ఆవేదన.. అధికారిక కార్యక్రమాల్లో అగౌరవం
ఆహ్వాన పత్రికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తర్వాత పేర్లు
అధికారులూ ప్రొటోకాల్ను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు
ఎంపీ ల్యాడ్స్తో చేపడుతున్న పనుల్లో జాప్యంపై అసంతృప్తి
ఎంపీల విజ్ఞప్తి మేరకు తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహ్వాన పత్రికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తర్వాత ఎంపీల పేర్లు ప్రచురిస్తున్నారని, అధికారులు కూడా ప్రొటోకాల్ను సరిగా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎంపీ ల్యాడ్స్తో చేపడుతున్న పనుల పురోగతిపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ల్యాడ్స్తో చేపట్టే పనులను త్వరగా పూర్తి చేయాలని.. ఎంపీల పదవీ కాలం ముగిసినా పనులు పూర్తికాని పరిస్థితి నెలకొందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీల ప్రొటోకాల్ను అధికారులు సరిగా పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
సచివాలయంలో భేటీ..
మంగళవారం సచివాలయంలో ఎంపీ ల్యాడ్స్ రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్రెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి, కె.విశ్వేశ్వర్రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మల్లారెడ్డితో పాటు ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి. ఆచార్య, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్తో పాటు ప్రణాళిక శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఎంపీ ల్యాడ్స్కు సంబంధించిన పనులను నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేయాలని.. జిల్లా కలెక్టర్లు ప్రత్యక్షంగా సమీక్షించేలా చూడాలని ఎంపీలు సమావేశంలో ప్రస్తావించారు. జీహెచ్ఎంసీ పనులకు సంబంధించి మంజూరు ప్రక్రియను సరళీకృతం చేయాలని.. వివిధ పనులకు నిధులిచ్చిన పార్లమెంట్ సభ్యుల పేర్లతో శిలాఫలకాలు ఉండాలని కోరారు. వివిధ శాఖల పరిధిలో చేపడుతున్న పనులను శాఖాధిపతులు వర్కింగ్ ఏజెన్సీలతో ప్రత్యేకంగా సమీక్షించాలని సూచించారు. ఉపాధి హామీ పనుల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రొటోకాల్ సమస్యలు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ప్రొటోకాల్ అమలయ్యేలా చూస్తాం..
ఎంపీ ల్యాడ్స్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఈ సందర్భంగా ఎంపీలకు సీఎస్ హామీ ఇచ్చారు. ఎంపీ ల్యాడ్స్ పనులను సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తామని, వచ్చే ఆరు నెలల్లో మంచి పురోగతి సాధిస్తామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టే పనులకు సంబంధించి మంజూరు ప్రక్రియలో మార్పులపై ప్రత్యేకంగా సమావేశం అవుతామన్నారు. జిల్లా స్థాయిలో జరిగే సమావేశాలను మూడు నెలలకోసారి నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశిస్తామని చెప్పారు. ప్రొటోకాల్ నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఇక ఎంపీ ల్యాడ్స్ మార్గదర్శకాలపై ప్రణాళికా శాఖ తెలుగులో సిద్ధం చేసిన పుస్తకాన్ని సీఎస్ ఆవిష్కరించారు. తెలంగాణలో 17 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని.. ప్రతి సభ్యుడికీ ఏటా రూ.5 కోట్ల చొప్పున నిధులు జారీ అవుతున్నాయని ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య సమావేశంలో వివరించారు. అందులో ఏటా ఎస్సీ ప్రాంతాల్లో 15 శాతం, ఎస్టీ ప్రాంతాల్లో 7.5 శాతం ఖర్చు చేయాలంటూ ఈనెల 18న కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.
నోడల్ జిల్లాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు
లోక్సభ సభ్యులకు సంబంధించి మొత్తం రూ.172.50 కోట్ల నిధులురాగా.. ఎస్సీల కోసం రూ.33.70 కోట్లు (19.58%), ఎస్టీల కోసం 25.33 కోట్ల (15.51%) పనులు మంజూరు చేశామని బి.పి. ఆచార్య తెలిపారు.
మొత్తంగా 8,941 పనులు మంజూరుకాగా.. 6,322 పూర్తయ్యాయని, మిగతా 1,211 పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఇక రాజ్యసభ సభ్యులకు సంబంధించి రూ.135 కోట్లురాగా.. ఎస్సీలకు రూ. 22.66 కోట్లు (16.79%), ఎస్టీలకు రూ.15.73 కోట్ల (11.65%) మేర పనులు మంజూరు చేశామన్నారు. మొత్తంగా 3,968 పనులు మంజూరు కాగా.. 2,902 పూర్తయ్యాయని, 791 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ పనుల కోసం 15 నోడల్ జిల్లాలో ఫెసిలిటేషన్ సెంటర్లు ప్రారంభించామన్నారు.