సాక్షిప్రతినిధి, కరీంనగర్: జలయజ్ఞంలో భాగంగా జనహృదయ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి శ్రీపాద (ఎల్లంపల్లి) ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి సరిగ్గా పద్నాలుగేళ్లయింది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నప్పటికీ అధికారికంగా ప్రారంభోత్సవం చేయకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ప్రజలకు అంకితం పేరిట 2014లో పైలాన్ నిర్మించి వదిలేశారు.
ఉమ్మడి ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును 28 జూలై 2004లో శంకుస్థాపన చేసి.. 36 (మూడేళ్లు) నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. రూ.2744 కోట్ల నిధులను జలయజ్ఞం కింద కేటాయించారు. ఇందులో డ్యాం(ప్రాజెక్టు)కు రూ.408.85 కోట్లకు బెంగళూరుకు చెందిన ఎస్పీఎంఎల్ ఐటీడీ సిమెంటేషన్ పనులు దక్కించుకుంది. రూ.191 కోట్లతో స్పిల్వే పియర్స్పై ఫ్యాబ్రికేషన్ గేట్ల పనులను ఎస్ఈడబ్ల్యూ (స్యూ), ఓం మెటల్స్ కంపెనీలు పనులను పొందాయి. ఈ మేరకు ఎల్ఎస్నెం.1/2004–05, 07–11–2004తో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాజెక్టును స్టేజ్–1, స్టేజ్–2గా విభజించా రు. మొదటి స్టేజీలో ఫేజ్–1, ఫేజ్–2గా విభజి స్తూ ఫేజ్–1లో ప్రాజెక్టు(డ్యాం) నిర్మాణాన్ని ఐటీడీ సిమెంటేషన్ దక్కించుకోగా.. ఫేజ్–2లో 6.5 టీఎంసీల నీటిని ఎన్టీపీసీకి పైపులైన్లతో నీటి సరఫరా పనులను ఎస్పీఎంఎల్ కంపెనీ దక్కించుకుంది.
పూడిక తొలగింపునకు ఆధునిక పరిజ్ఞానం
ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను విడుదల చేసేందుకు ఆధునిక పరిజ్ఞానంతో 42 నుంచి 45వ బ్లాక్ వరకు అడుగుభాగంలో (రివర్స్ స్లూయిస్) గేట్లను ఏర్పాటు చేశారు. ఈ విధానం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు లేకపోవడంతో అందులో సగానికి పైబడి పూడిక పేరుకుపోవడంతో చిన్నపాటి వరదలకే ప్రాజెక్టు నిండుతుంది. శ్రీపాద ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ (నీటి చుక్క లేకుండా) నీటిని బయటకు పంపించే అవకాశముంటుంది. ఫలితంగా నిల్వ నీటిలో పేరుకుపోయిన మట్టి, పూడిక అంతా వరదలో కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నీటి సామరŠాధ్యన్ని పూర్తిస్థాయిలో వినియోగించే వీలుంటుంది.
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఎల్లంపల్లి
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మారింది. ప్రస్తుత తరుణంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వానికి గుండెకాయగా మారిందని చెప్పుకోవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ విధానంతో తిరిగి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని మళ్లించనున్నారు. ఫలితంగా రెండువందల కిలోమీటర్ల పరిధిలో గోదావరినది వరద నీటితో సజీవంగా ఉంటుంది. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న పట్టింపు ఎల్లంపల్లి ప్రాజెక్టుపై లేకపోవడం గమనార్హం. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు సాకారమైందని చెప్పుకోవచ్చు.