విజృంభిస్తోంది..!

6 Jun, 2020 12:31 IST|Sakshi
అజ్జకొల్లులో మృత్యువుతో పోరాడుతున్న పశువులను చూసి రోదిస్తున్న రైతు బాలరాజు

లంపీ స్కిన్‌ వైరస్‌తో పశువుల మృత్యువాత

నెల రోజుల్లో 15పశువులు బలి

వైరస్‌ భారిన మరో 3,500 మూగజీవాలు

రాష్ట్ర పశువైద్య బృందం పరిశీలన.. నమూనాల సేకరణ

అధిక మోతాదులో మందు ఇవ్వడమే కారణమని రైతుల ఆరోపణ

వనపర్తి/మదనాపురం: జిల్లా వ్యాప్తంగా మూగజీవాలను కొత్త రకమైన వైరస్‌ వెంటాడుతోంది. కేవలం తెల్ల పశువులకే సోకుతున్న ఈ వైరస్‌ లంపి స్కిన్‌గా ఇటీవలె పశుసంవర్ధకశాఖ అధికారులు నిర్ధారించారు. ఇదివరకే ఈ విషయంపై రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాలో పర్యటించి నమూనాలు సేకరించి ఇది కౌ ఫాక్స్‌ వైరస్‌ లాంటిదేనని, కానీ రాష్ట్రంలో కొత్తగా బయటపడినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు వెల్లడించారు. వైరస్‌ సోకిన పశువుల్లో దద్దుర్ల తీవ్రత ఎక్కువగా ఉంటే తప్పా మరణాలు సంభవించవని ప్రకటించారు. ఇటీవల మదనాపురం మండలం అజ్జకోలులో వారం రోజుల్లో రూ.లక్షలు విలువ చేసే ఏడు పశువులు మృతి చెందటం, మరో మూడు పశువులు గత పదిహేను గంటలుగా మృత్యువుతో పోరాడటం చర్చనీయాంశంగా మారింది. అయితే, అజ్జకోలులోని బాధిత రైతులు మా పశువులు వైరస్‌ వలన చనిపోలేదని, పశువైద్యులు ఇచ్చిన అధిక మోతాదు మందుల వల్లనే చనిపోయాయని ఆరోపించడం గమనార్హం. 

లాక్‌డౌన్‌కు ముందు నుంచే..  
జిల్లాలోని పెబ్బేర్, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, మదనాపురం, కొత్తకోట, పాన్‌గల్‌ తదితర ప్రాంతాల్లో ఈ వైరస్‌ భారిన పశువులు పడినట్లు వైద్యాధికారుల నివేదిక ద్వారా వెల్లడవుతోంది. ఇప్పటి వరకు లంపి స్కిన్‌ వైరస్‌ భారిన జిల్లా వ్యాప్తంగా సుమారు 3,500 పశువులు పడినట్లు అధికారులు వెల్లడించారు. కౌ ఫాక్స్‌ తరహాలోని ఈ వైరస్‌ సోకిన పశువుల్లో వంటిపై దద్దుర్లు, గొంతువాపు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయంపై ఇదివరకే జిల్లా పశుసంవర్ధకశాఖఅధికారులు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పశువుల నుంచి రక్తం, మలమూత్రాల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు చేసి లంపి స్కిన్‌ వైరస్‌ అని నిర్ధారించారు. 

ఒక దాని నుంచి మరో దానికి వ్యాప్తి..  
తాజాగా జిల్లాలోని మదనాపురం మండలం అజ్జకొల్లులో రాజవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలరాజు రైతులకు చెందిన పశువుల్లో కొన్నింటికీ లంపీ స్కిన్‌ వైరస్‌ సోకింది. దీంతో కొత్తకోట పశువైద్యాధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్‌ పెన్సిలిన్‌తో పాటు ఐసోప్లడ్‌ ఇంజక్షన్, గ్లూకోజ్‌ ఇచ్చాడు. అనంతరం మూడు రోజుల అనంతరం మొత్తం ఆరు పశువులతోపాటు ఒక కోడె సైతం మృతిచెందాయి. మరికొన్ని మృత్యువుతో పోరాడుతుండగా.. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు, కొత్తకోట పశువైద్యుడు విజయ్‌కుమార్‌ అజ్జకొల్లుకు చేరుకొని వాటికి చికిత్స అందించారు.

రాష్ట్ర బృందం పరిశీలన  
పశువుల మృతి నేపథ్యంలో తెలంగాణ స్టేట్‌ వెటర్నరి అండ్‌ బయోలాజికల్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ దేవేందర్‌రావు, డాక్టర్‌ యం. కళ్యాణి వారి బృందంతో కలిసి శుక్రవారం అజ్జకొల్లును సందర్శించి మృత్యువుతో  పోరాడుతున్న  పశువులను   పరిశీలించారు. వాటి నుంచి మలమూత్రం, రక్తంతో పాటు లాలాజలం నమూనాలను సేకరించారు. అలాగే, మృతి చెందిన పశువుకు పోస్టుమార్టం   నిర్వహించి కొన్ని నమూనాలను సేకరించారు. వీటిని హైదరాబాద్‌ ల్యాబ్‌లో  పరీక్షించి  పశువులు   మృతి చెందటానికి గల కారణం వైరస్‌.. లేక హై డోస్‌ మెడిసిన్‌ ఇవ్వటం వలనా అనే విషయం వెల్లడిస్తామన్నారు.

ఈ వైరస్‌కు మందు లేదు
జిల్లాలో చాలా ప్రాంతాల్లో పశువులకు లంపీ స్కిన్‌ వైరస్‌ సోకింది. ఈ  వైరస్‌కు మందు లేదు. ఉన్న మెడిసిన్‌ వాడుతూ.. పశువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడా అదే విధంగా మా వైద్యులు ప్రయత్నం చేశారు. రాష్ట్ర స్థాయి బృందం వైరస్‌ భారిన పడిన పశువుల నమూనాలు సేకరించారు. ల్యాబ్‌లో పరీక్షించి మృతికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తారు.  – డాక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, వనపర్తి

మా పశువులకు నయం అయ్యింది
గత కొన్ని రోజుల క్రితం నాకు ఉన్న పదహారు పశువులకు గొంతు వాపు, వల్లు దుదు ర్లు వస్తే.. అజ్జకోలు స బ్‌ సెంటర్‌లో ఉండే సి బ్బంది దృష్టికి తీసుకువెళ్లా. మెరిక్వీన్, అస్రోప్లడ్‌ అనే మందు రాసిచ్చారు. కొని వా డితే తగ్గింది. మరీ మా గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు, మరో వ్యక్తి పశువులకు ఎందుకు మృతి చెందాయో తెలియదు. నా పశువులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాయి.       – సంజీవకుంట వెంకటేష్, అజ్జకోలు

మరిన్ని వార్తలు