భారీ పోలింగ్‌ ఎవరికి లాభం ?

9 Dec, 2018 14:18 IST|Sakshi

క్రమక్రమంగా తగ్గుతున్న ఓటర్ల సంఖ్య

సాక్షి, ఆదిలాబాద్‌: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి  భారీగా పోలింగ్‌ నమోదు కావడంతో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గంలో 73.88 శాతం పోలింగ్‌ జరగ్గా, ఈసారి ఏకంగా 83.10 శాతం  పోలింగ్‌ జరిగి రికార్డు సృష్టించింది. గతంతో పోల్చితే 9.22 శాతం పోలింగ్‌ అధికంగా జరిగింది. అంత భారీగా పోలింగ్‌ నమోదు కావడంతో అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. భారీ పోలింగ్‌  టీఆర్‌ఎస్‌కు అనుకూలిస్తుందా లేదా ప్రధాన ప్రత్యర్థి బీఎస్‌పీకి దోహద పడుతుందా, ఇతర అభ్యర్థులకు ఏమైనా లబ్ధి జరుగుతుందా అనేది రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఓటర్లు  పోటెత్తడంతో అభ్యర్థుల  గెలుపు ,ఓటములపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఊహించని విధంగా ఓట్లు పోలవ్వడంతో ఓటరు నాడి ఏందనేది అంతుచిక్కడం లేదు. పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు చివరికి ఎవరి పక్షం నిలిచారనేది తెలుసుకోవడానికి కష్టతరంగా మారింది.


బరిలో 13 మంది..పోటీ ఇద్దరి మధ్యే
అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈ సారి  13 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో పోటీమాత్రం ఇరువురు అభ్యర్థుల మధ్యనే హోరాహోరిగా సాగి నట్లు స్పష్టమైంది. ఇరువురు అభ్యర్థులు గెలుపే ప్రధాన లక్ష్యంగా చివరి వరకు తీవ్రంగా శ్రమించా రు. ఈ తీరుగా  పోలింగ్‌ కూడా అంచనాలకు మిం చి జరగడంతో అభ్యర్థుల్లో ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది.


ఏకపక్షమా....వ్యతిరేకమా ?
భారీగా పోలింగ్‌ జరగడంతో విశ్లేషకులకు కూడా ఓటర్లు ఎటువైపు మొగ్గారో అర్ధంకాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం బెల్లంపల్లితో పాటు తాండూర్‌ ,కాసిపేట ,నెన్నె ల, వేమనపల్లి ,కన్నెపల్లి , భీమిని ,బెల్లంపల్లి గ్రామీణ ప్రాంతాల్లో ఊహించని విధంగా పోలింగ్‌ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పోలిం గ్‌ జరగడం వల్ల ఆ ఓట్లు అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌కు అనుకూలిస్తుందా లేదా ప్రత్యర్థి పక్షమైన బీఎస్‌పీకి లబ్ధి చేకూరుస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇరువురు అభ్యర్థులు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓట్లు అధికంగా పోలయ్యాయి. 


పెరుగుతున్న పోలింగ్‌..తగ్గుతున్న ఓటర్లు
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఐదేళ్లకోసారి పోలింగ్‌ శాతం పెరుగుతుండగా ,ఓటర్ల సంఖ్యక్రమంగా హెచ్చుతగ్గుదలలో ఉంటోంది. ఓ టర్ల సంఖ్య నిలకడగా ఉండటం లేదు. వేలసంఖ్యలో తేడా ఉంటోంది. తగ్గుతున్న ఓటర్లతో నియోజకవర్గం ఉనికిని కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఈసారి కూడా పోలింగ్‌ శాతంలో పెరుగుదల  కనిపించగా , ఓటర్ల సంఖ్య మాత్రం తగ్గుదలలో ఉంది.

ఐదేళ్ల కోసారి ఓటర్లను పరిశీలిస్తే.......
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి వేరుపడి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. అసెంబ్లీ నియోజకవర్గాల పున:ర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైంది. తొలిసారి నియోజకవర్గంగా ఏర్పడిన 20 09లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 1,39, 215గా ఉండగా, 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో  అప్పటి ఓటర్ల సంఖ్య 1,56,935 గా నమోదైంది. ఆ తీరుగా తొలిసారి జరిగిన ఎన్నికల్లో  ఓ టర్ల సంఖ్యను పరిశీలిస్తే రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య వేలల్లో పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఏకంగా 17,720 మంది ఓటర్లు పెరి గారు. 2018 ప్రస్తుత  ఓటరు జాబితాలో 1,52 ,905 మంది ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తుండగా,అంతకుముందు 2014 ఎన్నికల్లో న మోదైన ఓటర్లసంఖ్య 1,56,935 ఓట్లతో సరిపోల్చితే 4,030 మంది ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగగా ప్రతిసారి ఓటర్ల సంఖ్యలో మార్పు ఉంటోంది.

మరిన్ని వార్తలు