టేకులపల్లి: తాగిన మైకంలో సెల్ టవర్ ఎక్కి అందరినీ ముచ్చెమటలు పట్టించిన సంఘటన మండలంలోని కోయగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చీమల భద్రయ్య కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. బుధవారం సాయంత్రం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య సారమ్మ మందలించింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన భద్రయ్య గ్రామం చివరిలో ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కాడు. చుట్టుపక్కల వారు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలిపారు.
విషయం తెలుసుకున్న సర్పంచ్ ఉమ, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సంఘటన స్థలానికి చేరుకును పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్, డయల్ 100 వచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా స్పందన లేదు.విద్యుత్ సరఫరా ఉంటుందనే భయంతో ఎవరూ పైకి ఎక్కడానికి సాహసించలేదు. రెస్క్యూ టీంని పిలిపించారు. వారు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈలోగా భారీ వర్షం మొదలైంది. టెక్నీషియన్తో మాట్లాడి ఆఫ్ చేయించారు. మైక్లో ఎస్ఐ మాట్లాడుతూ నిన్ను ఏమీ అనం .. కిందికి రావాలని కోరాడు. ఎస్ఐ విజ్ఞప్తి మేరకు భద్రయ్య కిందికి దిగి పారిపోయాడు.