ఇస్త్రీ బట్టల్లో రూ.5 లక్షల బంగారం దొరికినా..

29 Jun, 2020 10:43 IST|Sakshi
దంపతులను సన్మానిస్తున్న ఎస్సై, గ్రామస్తులు

సాక్షి, నల్గొండ : ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 5 లక్షల రూపాయల విలువైన బంగారం దొరికింది. రూపాయి రూపాయికి కక్కుర్తిపడుతున్న ఈ రోజుల్లో తమకు దొరికిన బంగారంపై ఆశపడలేదు ఆ దంపతులు. ఆ బంగారాన్ని యజమానికి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మునుగోడు మండలం, చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన కేతరాజు మంజుల–నర్సింహ దంపతులు దుస్తులు ఉతకడంతో పాటు ఇస్త్రీ సైతం చేస్తారు. అందులో భాగంగా చౌటుప్పల్‌లోని తంగడపల్లి రోడ్డులోని మారుతీనగర్‌ కాలనీకి చెందిన లక్ష్మి–భద్రారెడ్డి ఇంట్లో మంజుల ఈనెల 26న దుస్తులు ఉతికింది. ఆ క్రమంలో ఇంటి యజ మానురాలైన లక్ష్మి ఇస్త్రీ కోసం కొన్ని దుస్తులను ఆమెకు ఇచ్చింది. ఆదివారం ఉదయం దుస్తులను ఇస్త్రీ చేసే క్రమంలో ప్యాంటు జేబులో బాక్సును గుర్తించింది. (నిజాయితీకి మారుపేరు ఆ ఫ్యామిలీ )

తెరిచి చూడగా అందులో 10 తులాల బంగారం కనిపించింది. వెంటనే విషయాన్ని కౌన్సిలర్‌ ఆలె నాగరాజు దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన నాగరాజు బంగారం లభించిన విషయాన్ని లక్ష్మి–భద్రారెడ్డి దంపతులతో పాటు పోలీసులకు తెలియపర్చారు. 5 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఎంతో నిజాయితీగా అప్పగించేందుకు ముందుకు వచ్చిన మంజుల –నర్సింహ దంపతులకు ఎస్సై నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించా రు. బట్టలుపెట్టారు. బహుమతి అందజేశారు. 

మరిన్ని వార్తలు