కుటుంబ కలహాలే కారణం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
సాక్షి, సుల్తానాబాద్ రూరల్(పెద్దపల్లి): కుటుంబ కలహాలతో భర్త, భార్యను చంపిన సంఘటన శనివారం సుల్తానాబాద్ మండల పరిధిలో జరిగింది. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల అనుబంధ గ్రామం కోమండ్లపల్లికి చెందిన ఐలవేన సరోజన (40)ను భర్త ఐలవేన పోచయ్య శుక్రవారం రాత్రి ఆయుధంతో తలపై మోదీ హతమర్చాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. 20ఏళ్ల క్రితం శ్రీరాములపల్లికి చెందిన సరోజనతో పోచయ్యకు వివాహం జరిగింది. కొన్ని రోజులు కాపురం సజావుగా సాగినా పిల్లలు పుట్టకపోవడంతో అప్పటి నుంచి తరుచూ గొడవలు జరుగుతుండేవి. పిల్లలు పుట్టలేదనే కారణంతో పోచయ్య పదేళ్ల క్రితం వేరే మహిళను పెళ్లి చేసుకొని కాట్నపల్లి గ్రామంలో కాపురం పెట్టాడు.
మొదటి భార్య సరోజన దగ్గరకు అప్పడప్పుడు వచ్చేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి పోచయ్య, సరోజన వద్దకు రాగా మళ్లీ గొడవ జరిగింది. ఈనేపథ్యంలో పోచయ్య, సరోజనను బలమైన ఆయుధంతో తలపై మోదీ చంపినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ మహేందర్రెడ్డి పరిశీలించి వివరాలను సేకరించారు. మృతురాలి అన్న శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.