భార్యను వదిలి విదేశాలకు చెక్కేశాడు

30 Jul, 2018 09:28 IST|Sakshi
హన్మకొండలోని అత్తమామల ఇంటిముందు బైఠాయించిన తనుశ్రీ, ఆమె తల్లి కళావతి

సాక్షి, హన్మకొండ : జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న ఓ యువకుడు భార్యను వదిలి విదేశాలకు వెళ్లాడు. నాలుగేళ్లుగా పట్టించుకోకపోవడంతో బాధితురాలు అత్తింటి ఎదుట కొద్ది రోజులుగా ఆందోళనకు దిగింది. బాధితురాల కథనం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన సొంటి కళావతి, మధుసూదన్‌రెడ్డి దంపతుల కూతురు తనుశ్రీని వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం క్యాతంపల్లికి చెందిన చాడ శోభ, రాఘవేందర్‌రెడ్డి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు ఇచ్చి 2015 ఫిబ్రవరి 11న వివాహం చేశారు. తనుశ్రీ తండ్రి ఆమె చిన్నప్పుడే చనిపోయాడు. దీంతో తల్లే అన్నీ తానై కూతురు వివాహం చేసింది.

వివాహ సమయంలో రూ.20లక్షల కట్నం, 50తులాల బంగారం, మరో రూ.10లక్షలు వివాహ ఖర్చు ఇచ్చారు. అయినప్పటికీ ఆమెను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. వివాహమై నెల రోజుల తర్వాత శ్రావణ్‌కుమార్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లిపోయాడు. వీసా రాగానే తీసుకెళ్తానని చెప్పి నాలుగేళ్లుగా పట్టించుకోవడంలేదు. ఆ తర్వాత భర్తతో ఫోన్‌లో మాట్లాడినా ఏడాది కాలంగా ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేశాడని ఆమె పేర్కొంది. అత్తా, మామలు శోభ, రాఘవేందర్‌రెడ్డి హన్మకొండ నక్కలగుట్ట వివేక్‌నగర్‌లో నివసిస్తున్నారు. తనను భర్త వదిలేయడంతో తరుచూ అత్తింటి ఎదుట తరుచూ బైఠాయించి న్యాయం చేయాలని కోరుతోంది.

నాలుగు రోజులుగా బైఠాయించి ఆందోళన చేస్తున్నా ఎవరూ రావడంలేదని తెలిపింది. కొద్ది రోజుల క్రితం తనను అత్తమామ, బావ జీవన్‌రెడ్డి (భర్త సోదరుడు) కొట్టి, రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి పంపించారని పేర్కొంది. ఇప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని రోదించింది. తాను హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని వివరించింది. తనకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలువాలని కోరుతోంది.

మరిన్ని వార్తలు