అనుమానంతో అన్నను చంపాడు

24 Jul, 2015 00:30 IST|Sakshi
అనుమానంతో అన్నను చంపాడు

- కత్తితో పొడిచి
- అంతం చేసిన తమ్ముడు
- తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని హత్య
- మద్యం మత్తులో దారుణం
- కీసర మండలం చీర్యాలలో ఘటన  
కీసర:
ఓ వ్యక్తి అనుమానంతో మద్యం మత్తులో అన్నను కత్తితో పొడిచి చంపేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని భావించి హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి తర్వాత కీసర మండల పరిధిలోని చీర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని బాలానగర్ చింతల్ ప్రాంతానికి చెందిన దుర్గారావు(40), నాగేందర్ అన్నదమ్ములు. వీరు కొన్ని రోజుల క్రితం బతుకుదెరువు కోసం చీర్యాల గ్రామానికి  వలస వచ్చారు. స్థానిక అటవీ ప్రా ంతంలో జంతువులను వేటాడి వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, కుటుంబ కలహాల నేపథ్యంలో దుర్గారావుకు భార్యాపిల్లలు దూరంగా ఉంటున్నారు.

నాగేందర్‌కు ముగ్గురు భార్యలు. వారిలో ఒకరు విడాకులు తీసుకొని భర్త నుంచి దూరంగా ఉంటున్నారు. అన్నదమ్ములు ఇద్దరు పక్కపక్కనే ఉంటున్నారు. తన భార్యతో అన్న దుర్గారావు వివాహేతర సంబం ధం నెరుపుతున్నాడని కొంతకాలంగా నాగేందర్ అనుమానించసాగాడు. ఈనేపథ్యంలో తరచూ అతడు అన్నతో గొడవపడుతుండేవాడు. ఈక్రమంలో బుధవారం అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆయన అర్ధరాత్రి దాటిన తరువాత అన్న దుర్గారావుతో గొడవపడ్డాడు. ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో నాగేందర్ తన వద్ద ఉన్న కత్తితో దుర్గారావును పొడిచి చంపేశాడు. స్థానికుల సమాచారంతో కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుర్గారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు నిందితుడు నాగేందర్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు