నాగంకు గన్‌మెన్ల ఉపసంహరణ 

29 Jun, 2018 01:22 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌:  మాజీ మంత్రి, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నాగం జనార్దన్‌రెడ్డికి ఉన్న ఇద్దరు గన్‌మెన్లను రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆదేశాలు జారీ చేయడంతో గన్‌మెన్లు విధులకు హాజరు కాలేదు. విషయం తెలుసుకున్న నాగం జనార్దన్‌రెడ్డి, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో మాట్లాడగా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారని తెలిసింది.

రాష్ట్ర ప్రభుత్వంపై గతంలో కోర్టుల్లో పలు కేసులు వేసిన నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలంటూ నాగం పోలీస్‌ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు.  కాగా, నాగంకు ప్రాణహాని ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని, నిఘా సంస్థల నివేదిక ఆధారంగానే గన్‌మెన్లను ఉపసంహరించామని పోలీస్‌ శాఖకు చెందిన ఓ అధికారి వివరించారు. అవసరమైతే పెయిడ్‌ గన్‌మెన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకనే రాష్ట్ర ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించిందని నాగం ఆరోపించారు.   

మరిన్ని వార్తలు