బాలుడి కిడ్నాప్ నకు యత్నం.. మహిళ అరెస్ట్

5 Aug, 2015 16:47 IST|Sakshi

కోల్‌సిటీ-గోదావరిఖని: అప్పుడే పుట్టిన బాలుణ్ని అపహరించేందుకు ప్రయత్నించిన మహిళను బంధువులు, ఆస్పత్రి సిబ్బంది కలిసి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం జరిగింది. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం దానపల్లి గ్రామానికి చెందిన రాజలింగం భార్య సంధ్య రెండో కాన్పులో బాలుడికి జన్మనిచ్చింది. కాగా, ఆపరేషన్ అనంతరం సంధ్యను వేరే గదికి తరలిస్తుండగా బాలుడిని సంధ్య వాళ్ల అత్త కిట్టమ్మ పట్టుకుంది.

అయితే.. రామగుండం మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన ఒక మహిళ ఆశ వర్కర్‌గా కిట్టమ్మను పరిచయం చేసుకుంది. బాలుడు పుట్టినందుకు రూ.10వేలు వస్తాయని నమ్మించింది. బాలుడిని సార్‌కు చూపిస్తానని చెప్పి కిట్టమ్మ దగ్గర నుంచి తీసుకుంది. ఈ క్రమంలోనే ఆ మహిళ బాలుడిని తీసుకొని పరుగెత్తసాగింది. అనుమానం వచ్చిన బంధువులు ఆమెను పట్టుకొని ఆస్పత్రి సిబ్బంది దగ్గరకు తీసుకెళ్లారు. కాగా, ఆస్పత్రి సిబ్బంది ఆమె ఆశ వర్కర్ కాదని తేల్చడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా, ఇద్దరు వ్యక్తుల ప్రోద్బలంతోనే తాను ఈ పని చేశానని తెలిపింది.

మరిన్ని వార్తలు