-

ప్రాణంతీసిన ఇష్టంలేని పెళ్లి..

13 May, 2018 07:57 IST|Sakshi
అంగురి మృతదేహం ఇన్‌సెట్‌లో ఫైల్‌ ఫోటో

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తల్లిదండ్రుల బలవంతపు పెళ్లి ఓ యువతి ప్రాణాలు తీసింది. ప్రేమించిన యువకున్ని కాదని మరో వివాహం జరిపించగా..ఇష్టంలేని వ్యక్తితో కాపురం చేయలేక ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన వీర్నపల్లి మండలం కంచర్లలో విషాదం నింపింది. ఎస్సై ఎంవీ.సురేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన అజ్మీరా అంగురి (20) ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమించింది. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు కామారెడ్డి జిల్లా ముత్కేడు గ్రామానికి చెందిన సంతోష్‌తో ఏడు నెలలక్రితం వివాహం జరిపించారు. సంతోష్‌ను ఇల్లరికం తీసుకొచ్చుకున్నారు. మూడు నెలలకు అంగురి ప్రేమ విషయం భర్తకు తెలిసింది. దీంతో నాలుగు నెలలక్రితం సంతోష్‌ తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో పరిస్థితిని అంచనా వేసిన ప్రేమికుడు 20రోజులక్రితం గల్ఫ్‌ వెళ్లిపోయాడు. అటు భర్తతో ఎడబాటు.. ఇటు ప్రేమికుడు దూరం కావడంతో శుక్రవారం అంగురి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. చుట్టప్రక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. ఎస్సై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు