హైదరాబాద్: పెళ్లికి తీసుకెళ్లనందుకు భర్తతో గొడవపడిన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... న్యూబాబానగర్కు చెందిన సాజిదా బేగం(38), మహ్మద్ గౌస్లు భార్యభర్తలు. అయితే వట్టేపల్లిలో నివాసం ఉండే మహ్మద్ గౌస్ సోదరుడి కుమార్తె వివాహానికి వెళ్లే విషయంలో శుక్రవారం దంపతుల నడుమ విభేదాలు తలెత్తాయి. భార్యకు తెలియకుండా మహ్మద్ గౌస్ వివాహానికి హాజరయ్యాడు. వివాహానంతరం ఇంటికి వచ్చిన భర్తతో సాజిదా బేగం తీవ్రంగా గొడవ పడింది. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. 60 శాతం కాలిన గాయాలకు గురైన ఆమెను పోలీసుల సాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతి చెందింది. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.