పట్టుకోమని ఇస్తే.. పట్టుకుపోయింది!

1 Jul, 2015 10:58 IST|Sakshi
పట్టుకోమని ఇస్తే.. పట్టుకుపోయింది!

పసిగుడ్డుతో మహిళ పరారీ
పోలీసులకు ఫిర్యాదుచేసిన తల్లి


మైలవరం: టాయ్‌లెట్‌కు వెళ్లి వస్తాను బిడ్డను పట్టుకోమని యిస్తే సదరు మహిళ బిడ్డతో పాటు మాయమైన ఘటన మైలవరం బస్టాండ్‌లో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన  బాణావతు సంధ్య స్థానికంగా వున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి రుద్రవరం వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్‌లోకి వచ్చింది.

ఈ లోగా టాయ్‌లెట్‌కు వెళ్లే అవసరం రావడంతో పక్కనే వున్న తమ వర్గానికి చెందిన గిరిజన మహిళకు తన మూడు నెలల మగ బిడ్డను అప్పగించి వెళ్లింది. టాయ్‌లెట్ నుంచి తిరిగి వచ్చేసరికి బిడ్డతో పాటు మహిళ మాయమైంది. వెంటనే బాధితురాలు ఇంటికి వెళ్లి బంధువులకు సమాచారమివ్వడంతో వారు హుటాహుటిన మైలవరం చేరుకుని అన్నిచోట్ల పసికందును తీసుకుపోయిన మహిళ కోసం వెదికి, ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూజివీడు డిఎస్పీ వెంకటరమణ, మైలవరం సీఐ వెంకటరమణ బాధితురాలిని, కుటుంబ సభ్యులను పిలిచి వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు