పోయిన పర్సు ఇంటికే వచ్చింది!

2 Aug, 2018 12:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సొమ్ములు పోగొట్టుకున్న ఓ మహిళ ఇంటికి చేరేలోపే ఆమె సొమ్ములు భద్రంగా ఉన్నట్లు పోలీసులు సమాచారం అందించడమేగాక బాధితురాలిని పిలిపించి వాటిని అప్పగించిన సంఘటన బుధవారం అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మలక్‌పేట ఏసీ పీ నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ ఏపీ ఆనంద్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట పోచమ్మబస్తీకి చెందిన అలివేలు సొదరుని వైద్యం కోసం తన రెండు తులాల పుస్తెల తాడు, వెంటి పట్టీలను తనఖా పెట్టేందుకు మార్వాడీ దుకాణానికి వెళ్లింది. మార్వాడి ఇస్తానన్న డబ్బులు సరిపోకపోవడంతో ఆమె మరో ఫైనాన్స్‌ సంస్థకు వెళ్తుండగా శ్రీరమణ చౌరస్తా వద్ద ఆమె పర్స్‌ పడిపోయింది. ఫైనాన్స్‌ సంస్థ వద్దకు వెళ్లి చూసుకున్న అలివేలు ఆందోళనకు గురైంది.

అదే సమయంలో శ్రీరమణ చౌరస్తా మీదుగా వెళ్తున్న జైస్వాల్‌ గార్డెన్‌కు చెందిన బుచ్చిబాబుకు రోడ్డుపై దొరికిన పర్సును అంబర్‌పేట పోలీసులకు అప్పగించాడు. పర్సును పరిశీలించిన పోలీసులు అందులో ఉన్న రసీదు ఆధారంగా మార్వాడి దుకాణాన్ని సంప్రదించి అలివేలు అడ్రస్‌ తెలుసుకున్నారు. పోచమ్మబస్తీలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లేలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరాశగా ఇంటికి చేరుకున్న అలివేలు వద్ద వివరాలు తీసుకుని  స్టేషన్‌కు పిలిపించి పర్సును అప్పగించారు. ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పర్స్‌ అప్పగించిన బుచ్చిబాబును ఏసీపీ అభినందించారు. 


అలివేలుకు పర్సు అందజేస్తున్న ఏసీపీ నర్సింగరావు   

>
మరిన్ని వార్తలు