నిజాయితీ చాటుకున్న మహిళ

13 May, 2018 10:52 IST|Sakshi
తహసీల్దార్‌కు చెక్కును తిరిగి ఇస్తున్న లీలాకుమారి

జనగామ : తాను అమ్ముకున్న భూమికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకంలో మంజూరు చేసిన పెట్టుబడి చెక్కును ఓ మహిళ అధికారులు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన సీహెచ్‌ లీలాకుమారి తనకున్న 7.10 ఎకరాల భూమిని పదేళ్ల క్రితం అమ్ముకున్నారు. అయితే భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకుని, రెవెన్యూలో కన్వర్షన్‌ చేసుకోకపోవడంతో నేటికీ పట్టాదారు కాలంలో లీలాకుమారి పేరు ఉంది.

అయితే భూ ప్రక్షాళన పూర్తి చేసుకుని, రైతు బంధు చెక్కులను సిద్ధం చేయగా, అందులో పెట్టుబ డి సాయం కింద లీలాకుమారికి రూ.32,700 చెక్కు మంజూరు చేశారు. కాగా, రెవెన్యూ అధికారులు ఆమెకు చెక్కు వచ్చిందని సమాచారం అందించగా, అమ్ముకున్న భూమికి పెట్టుబడి అవసరం లేదని అధికారులకు తేల్చి చెప్పారు. తనలోని నిజాయితీని చాటుకుంటూ.. చెక్కును తహసీల్దార్‌ రమేష్‌కు అప్పగించారు. ఆమెను అధికారులతో పాటు జిల్లా ప్రజలు అభినందించారు.

మరిన్ని వార్తలు