సాక్షి, హైదరాబాద్: వైన్ షాపుల ఏర్పాట్లను పలుచోట్ల అడ్డుకున్నారు. కుర్మగూడలో ఏర్పాటు చేయనున్న వైన్షాపును ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, కార్పొరేటర్లు సమీనా, ముజఫ్ఫార్ హుస్సేన్లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు షాపును ఖాళీ చేయిస్తున్నారు. అలానే రాచకొండ బీఎన్ రెడ్డి నగర్ కాలనీలో రెండు దేవాలయాలు, స్కూలుల మధ్య వైన్ షాపు ఏర్పాటు చేస్తున్న తరుణంలో కాలనీ వాసులు అడ్డుకున్నారు. అయినా నిర్మాణం చేపడుతుండగా మహిళలు దానిని కూల్చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడికి స్థానిక పోలీసులు చేరి ఇరు వర్గాల వారిని శాంతిపజేశారు.
అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంగడి సెంటర్లో ఉన్న మద్యం దుకానాన్ని తీసివేయాలని మహిళలు, స్థానికులు షాపు ముందు ధర్నా చేపట్టారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో జనావాసాల మధ్య వైన్ షాపు పెట్టకూడదని స్థానికులు అడ్డుకున్నారు.