మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి 

16 Jun, 2019 03:03 IST|Sakshi
శనివారం ఎస్‌హెచ్‌జీ వార్షిక రుణ ప్రణాళిక(2019–20)ను ఆవిష్కరిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సెర్ప్‌ సీఈవో పౌసమి బసు తదితరులు

గ్రామాల్లో అన్ని వ్యాపారాలు మహిళా సంఘాలే నిర్వహించే స్థాయికి రావాలి

బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి

ఎస్‌హెచ్‌జీల వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లో అన్ని వ్యాపారాలను మహిళా సంఘాలే నిర్వహిం చేలా, ఆర్థిక పరిపుష్టిని సాధించేలా కృషి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిల్లో వివిధ ప్రైవేట్‌ వ్యాపారులు, ఇతరులు నిర్వహించే పరిశ్రమలన్నీ మహిళా సంఘాలే నిర్వహించేలా ఈ వ్యవస్థ బలోపేతం కావాలనేది రాష్ట్ర ప్రభుత్వ కోరిక అని పేర్కొన్నారు. కల్తీలను నిరోధించేందుకు ఆయా వ్యాపారాలన్నీ కూడా మహిళా సంఘాల ద్వారా చేయించాలని సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారన్నారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకైనా సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) బ్యాంకు లింకేజీ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పీఆర్‌ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, సెర్ప్‌ సీఈవో పౌసమి బసు, ఎస్‌ఎల్‌డీసీ చైర్మన్‌ ఓంప్రకాశ్‌ మిశ్రా, ఆర్‌బీఐ మేనేజర్‌ శంకర్, నాబార్డ్‌ సీజీఎం విజయ్‌కుమార్‌లతో కలిసి 2019–20 ఆర్థిక ఏడాదిలో రూ. 6,584 కోట్లకు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ అందించేందుకు సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.

ఈ సందరర్భంగా మంత్రి రుణ ప్రణాళిక లక్ష్యాలను వివరించడంతోపాటు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. రుణ లక్ష్యాలకు మించి తమ ప్రభుత్వం సంఘాలకు కార్యక్రమాలు ఇస్తుందని, అందువల్ల అంతకు మించి రుణాలిచ్చేందుకు బ్యాంకులు సహకరించాలని కోరా రు. ప్రతి గ్రామంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయబోతోందన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్‌ ఆర్గనైజింగ్‌ అసిస్టెంట్‌ను నియమిస్తున్నట్టు, సంఘాల్లోని ప్రతి మహిళ ఏయే కార్యకలాపాలు చేపడుతుందో తెలుసుకోవడంతో పాటు ప్రతి ఇంటికి సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ తయా రు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ తెలిపారు.

సెర్ప్‌ ద్వారా చేపడుతున్న కార్యకలాపాలు, తదితర అంశాలను గురించి సీఈవో పౌసమి బసు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. మహిళా సంఘాలకు అన్నివిధాలా సహాయ, సహకారాలను అందిస్తామని ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌ ఓపీ మిశ్రా వెల్లడించారు. సంఘం లోని ఒక్కో మహిళకు ఇచ్చే రుణాల్లో రూ. 25 వేల వరకు ప్రాసెసింగ్‌ చార్జీలు వసూలు చేయరా దని ఆర్‌బీఐ నిర్దేశించిందని ఆర్‌బీఐ మేనేజర్‌ శంకర్‌ తెలిపారు. కొన్ని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల చార్జీలు, ప్రాసెసింగ్‌ చార్జీలు తగ్గించాలని కోరినపుడు ఆయనపై విధంగా స్పందించారు. 1992లో 500 గ్రూపులతో మొదలైన స్వయం సహాయక సంఘాల ఉద్యమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87 లక్షల గ్రూపులకు విస్తరించిందని నాబార్డ్‌ సీజీఎం విజయ్‌కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు