పంచాయతీల్లో మహిళా ఓటర్లే ఎక్కువ!

20 May, 2018 02:34 IST|Sakshi

ఓటర్ల సంఖ్యలో నల్లగొండ జిల్లా ఫస్ట్‌.. మేడ్చల్‌ జిల్లా లాస్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలలో మొత్తం 1,37,15,150 మంది ఓటర్లుండగా.. వీరిలో 68,49,146 మంది పురుషులు, 68,65,144 మంది మహిళలు, 860 మంది ఇతరులు (ట్రాన్స్‌ జెండర్‌) ఉన్నారు. పురుషుల కంటే 15,998 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.  ఇతరుల కేటగిరీ ఓటర్లు అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 81 మంది ఉండగా.. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో తక్కువగా ముగ్గురే ఉన్నారు.

ఇతరుల కేటగిరీ ఓటర్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉండడం వల్ల పంచాయతీలలో ఈ సంఖ్య తక్కువగా ఉందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లున్నారు. అలాగే గ్రామ పంచా యతీలు, వార్డుల సంఖ్య విషయంలోనూ ఈ జిల్లానే అగ్రస్థానంలో ఉంది. మొత్తంగా 844 గ్రామపంచాయతీల్లో 7,340 వార్డులుండగా.. 8,50,664 మంది ఓటర్లు నల్లగొండ జిల్లాలో ఉన్నారు. ఇక మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో తక్కువ పంచాయతీలుండటంతో ఓటర్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మొత్తంగా 61 పంచాయతీల్లో 596 వార్డులుండగా.. 1,26,011 మంది ఓటర్లున్నారు.  

మరిన్ని వార్తలు