ఆమె.. అనాసక్తి

15 Apr, 2019 08:19 IST|Sakshi

తగ్గిన మహిళా ఓటింగ్‌

పురుషులతో పోలిస్తే తక్కువ  

అన్ని నియోజకవర్గాల్లోనూ అంతే..  

గెలుపోటములపై ప్రభావం  

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికలపై సిటీజనులు అనాసక్తి చూపగా... అందులోనూ మహిళల ఓటింగ్‌ శాతం మరింత పడిపోవడం చర్చనీయాంశమైంది. నగరంలోని అన్ని నియోకజవర్గాల్లోనూ మహిళల ఓటింగ్‌ శాతం పురుషులతో పోలిస్తే తక్కువగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మొత్తంగా 47.21 శాతం  పురుషులు ఓటు వేస్తే... మహిళల్లో కేవలం 42.12 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యల్పంగా యాకుత్‌పురాలో 34.76 శాతం, మలక్‌పేటలో 35.78 శాతం మహిళల ఓటింగ్‌ నమోదైంది. ఇక సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో పురుషుల ఓటింగ్‌ 53.73 శాతం నమోదైతే... మహిళల ఓటింగ్‌ 52.68 శాతానికే పరిమితమైంది.

నాంపల్లిలో అత్యల్పంగా 36.48 శాతం, సికింద్రాబాద్‌లో 42.12 శాతం ఓటింగ్‌ నమోదైంది. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోనూ మహిళల ఓటింగ్‌ తక్కువగానే  నమోదైంది. ఈ నియోజకవర్గంలో పురుషుల ఓటింగ్‌ 50.20 శాతం, మహిళల ఓటింగ్‌ 48.81 శాతం. అత్యల్పంగా ఎల్బీనగర్‌లో 43.48 శాతం, ఉప్పల్‌లో 45.65 శాతం నమోదైంది. అయితే కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోకజవర్గాల్లో మాత్రమే పురుషులతో సమానంగా మహిళలు ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. కూకట్‌పల్లిలో పురుషుల ఓటింగ్‌ 50.82 శాతం ఉండగా.. మహిళల ఓటింగ్‌ 50.62 శాతం. కుత్బుల్లాపూర్‌లో పురుషుల ఓటింగ్‌ 49.86 శాతం ఉండగా... మహిళల ఓటింగ్‌ 49.37 శాతం. ఇక చేవెళ్ల లోక్‌సభ పరిధిలో పురుషుల ఓటింగ్‌ 41.97 శాతం, మహిళల ఓటింగ్‌ 41.62 శాతం నమోదైంది. మహిళల ఓటింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో ఆయా పార్టీల జయాపజయాలు, మెజారిటీల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు