‘మేడిగడ్డ’ పనుల్లో వేగం పెంచాలి

9 Aug, 2018 02:23 IST|Sakshi
కన్నెపల్లిలోని మేడిగడ్డ పంపుహౌస్‌ పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

సెప్టెంబర్‌ చివరి వరకు టెస్టింగ్‌ పూర్తి చేయాలి: హరీశ్‌రావు  

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి (మేడిగడ్డ) పంపుహౌస్‌ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్‌ అధికారులకు, ఏజెన్సీ సంస్థలను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. బుధవారం రాత్రి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కన్నెపల్లిలో నిర్మిస్తున్న మేడిగడ్డ పంపుహౌస్‌ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మెగా క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు చివరన మొదటి పంపు డ్రైరన్‌ (మోటార్ల పనితీరు పరిశీలన), సెప్టెంబర్‌ 5న వెట్‌ రన్, రెండో పంపు సెప్టెంబర్‌ 10న డ్రైరన్, 15న వెట్‌ రన్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పంపు హౌస్‌లో అమర్చనున్న శక్తివంతమైన మోటార్లకు అవసరమున్న సబ్‌స్టేషన్‌ నిర్మాణం ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాళేశ్వరం బ్యారేజీ చీఫ్‌ ఇంజనీర్‌ నల్ల వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ రమణారెడ్డి, డీఈఈప్రకాష్, సూర్యప్రకాష్, మెగా సంస్థ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు