ప్రతి అసెంబ్లీ కేంద్రంలో మహిళా దినోత్సవం

1 Mar, 2018 04:53 IST|Sakshi

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సాక్షి, హైదరాబాద్‌: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నిధులను జిల్లాలకు విడుదల చేస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై  ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, సాంస్కృతిక మండలి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ తదితరులతో ఆయన సమావేశం నిర్వహించారు.

మార్చి 8న రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి వేదికగా లలితకళాతోరణాన్ని పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య  జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. శుక్రవారం మరోమారు ఉత్సవ కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు. ‘భేటీ బచావో, భేటీ పడావో’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి కేంద్రం ప్రశంసలు పొందిన హైదరాబాద్‌ జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు