రేపు యాదాద్రి ఆలయం మూసివేత

25 Dec, 2019 10:31 IST|Sakshi

నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర సేవలు నిలిపివేత

సూర్యగ్రహణం సందర్భంగా.. 

నేటిరాత్రినుంచి ఆలయం బంద్‌

సాక్షి, యాదగిరిగుట్ట : పాక్షిక సూర్యగ్రహణం కారణంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రినుంచి ఈ నెల 26(గురువారం)వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు మూసివేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8.26గంటల నుంచి 10.57గంటల వరకు మోక్షకాలం ఏర్పడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని బుధవారం (నేడు) రాత్రి ఆలయ ద్వారబంధనం చేస్తారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12గంటల తరువాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, మహానివేదన అనంతరం 2గంటలనుంచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తామని తెలిపారు. సాయంకాలం భక్తుల మొక్కుసేవలు, దర్బార్‌సేవ, అర్చనలు యధావిధిగా ఉంటాయని పేర్కొన్నారు. పాతగుట్ట ఆలయాన్ని సైతం మూసివేస్తామని తెలిపారు. పాక్షిక సూర్యగ్రహణం అనంతరం శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని శుద్ధి చేసి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వ్రతాలు జరిపిస్తామని పేర్కొన్నారు.

వాడపల్లిలో..
దామరచర్ల(విుర్యాలగూడ):  జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లిలోని దేవాలయాలను ఈ నెల 26న మూసివేయనున్నట్లు వాడపల్లి ఆలయాల మేనేజర్‌ మృత్యుంజశాస్త్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా గురువారం  ఉదయం 7గంటల నుంచి శ్రీ మీనాక్షి ఆగస్తేశ్వరదేవాలయం, శ్రీలక్ష్మీనర్సింహాస్వామి దేవాలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు